(ఫోటోలు) కాల్ మనీ రాజేష్తో జగన్: బయటపెట్టిన బొండా, అతనో 'ఆంబోతు' రాంబాబు
హైదరాబాద్: కాల్ మనీ పేరుతో అధిక వడ్డీ రూపంలో తిరిగిన డబ్బు అంతా వైసిపి అధినేత జగన్ అవినీతి సంపాదనే అని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
వైసిపి నేతలు కాల్ మనీ పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. విజయవాడలో జరిగిన కాల్ మనీ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన దూడల రాజేష్... వైసీపీ అధ్యక్షుడు జగన్కు అత్యంత సన్నిహితుడు అని చెప్పారు. అందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు.
దూడల రాజేష్ 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థుల కోసం అనేక సందర్భాలలో జగన్ను కలవడంతో పాటు జ్ఞాపికలను అంద జేశాడని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కాల్ మనీ కేసులో అరెస్టైన 100 మందిలో 44 మంది వైసిపి నేతలే అన్నారు.
పదేళ్ల కాంగ్రెస్ పాలనలో పెరిగిన విషవృక్షాల్లో కాల్ మనీ ఒకటి అన్నారు. అగ్రిగోల్డ్, ఎర్ర చందనం, స్మగ్లింగ్, కల్తీ మద్యం, కాల్ మనీ మొదలైనవన్నీ కాంగ్రెస్ పాలనలో బలంగా వేళ్లూనుకున్నాయన్నారు. కేవలం పద్దెనిమిది నెలల పాలనలోనే వీటని తమ ప్రభుత్వం కూకటి వేళ్లతో పెకిలించేస్తోందన్నారు.
సమర్థ పోలీసింగ్, స్వేచ్ఛాయుత పోలిసింగ్ టిడిపి విధానం అన్నారు. 2014 ఎన్నికల్లో టిడిపి గెలుస్తుందని సర్వే నివేదికలు చూసి అనేకమంది నేరగాళఅలు విదేశాలకు వెళ్లిపోయారని, వారిని తీసుకొచ్చిన ఘనత ఏపీ పోలీసులది అన్నారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో నేరగాళ్ల స్వర్గంగా రాష్ట్రాన్ని మార్చారని, ఏటీఎం దోపిడీలు, దొంగ నోట్ల మార్పిడీ, మనీ లాండరింగ్, మనీ లెండింగ్, కల్తీ మద్యం, లెడ్ సాండర్స్, ఇలా అనేక నేరాల్లో వైసిపి నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే టిడిపి నేరగాళ్ల గుండెల్లో సింహస్వప్నం అయిందన్నారు.
కాల్ మనీ బాధిత కుటుంబాలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నేరగాళ్లపై చర్యలు తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలిపారన్నారు. నిందితులు ఎవరైనా, ఏ పార్టీ వారైనా, ఏ స్థాయిలో ఉన్నవారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. డబ్బుకట్టవద్దని తాము బాధితులకు సూచించామన్నారు.
వైసిపి నేత అంబటి రాంబాబును మించిన దుశ్సాసనుడు లేడన్నారు. అంబోతు రాంబాబు దుశ్సాసన పర్వాన్ని ఏబీఎన్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఏనాడో బయటపెట్టిందని ధ్వజమెత్తారు. వైసిపి నాయకులకు టిడిపిని విమర్శించై నైతిక హక్కు లేదన్నారు.