'ఎమ్మెల్యే మేడా దారిలోనే మరికొందరు టీడీపీ నేతలు బయటకు': వలసలతో టీడీపీలో గుబులు!
అమరావతి: తెలుగుదేశం పార్టీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మంగళవారం స్పందించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
టీడీపీ పగలు కాంగ్రెస్ పార్టీతో, రాత్రి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో కలిసి నడుస్తోందని బొత్స విమర్శించారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం లేదని ఆరోపించారు. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తే అందులో ఐదు శాతం వాటా కాపులకు కేటాయిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం ఏమిటని నిలదీశారు.
టీడీపీలోకి వంగవీటి రాధాకు స్వాగతం, ఆ పదవి ఆఫర్?: జగన్కు రెండ్రోజుల గడువు వెనుక!
టీడీపీ ఖాళీ కావడం ఖాయం
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ కావడం ఖాయమని బొత్స జోస్యం చెప్పారు. ప్రజలంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ఖాయమని చెప్పారు. టీడీపీ నేతలు ఇకనైనా మోసాలు, మాయలు కట్టిపెట్టాలన్నారు. ప్రజలను గందరగోళానికి గురి చేయవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే చంద్రబాబు ఇష్టానుసారంగా వరాలు ఇస్తున్నారని, కానీ ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని చెప్పారు.
వైసీపీకీ మెజార్టీ
రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని బొత్స అన్నారు. సామాన్యులకు న్యాయం చేయాలన్న తపన, కోరిక టీడీపీకి లేదని విమర్శించారు. జగన్ ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొట్టారన్నారు. చంద్రబాబు అమలు చేసినా, చేయకపోయినా వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పథకాలను అమలు చేస్తామన్నారు. కేవలం మేడా మల్లికార్జున రెడ్డి మాత్రమే కాదనీ ఇంకా చాలామంది టీడీపీ నుంచి బయటకు వస్తారని చెప్పారు.
టీడీపీ నుంచి మరికొందరు నేతలు
ఇదిలా ఉండగా, టీడీపీలో నుంచి పలువురు నేతలు బయటకు వెళ్లడం ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నట్లుగా ఉందని చెబుతున్నారు. కర్నూలులో అఖిలప్రియ తీరుతో రెండోస్థాయి నేతలు, ఇప్పుడు కడపలో మేడ మల్లికార్జున రెడ్డి వెళ్లారు. అలాగే, మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు కూడా అంతకుముందు పార్టీని వీడారు. ఎన్నికలకు ముందు ఇది టీడీపీకి ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు.