జనసేన..బీజేపీ పొత్తుపై: ఇద్దరు సీఎంలు తేల్చేసారు: వారి అంచనా ..వ్యూహం ఇదే..!
హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతోంది. అదే సమయంలో ఢిల్లీ పవన్ కళ్యాణ్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో సమావేశమయ్యారు. ఏపీలో రాజకీయంగా రెండు పార్టీలు కలిసి అడుగులు వేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇదే అంశం పైన ఇటు ముఖ్యమంత్రుల సమావేశంలోనూ చర్చకు వచ్చింది.
బీజేపీ వేస్తున్న రాజకీయ అడుగులు గురించి ఇద్దరు సీఎంలు చర్చించారు. ఏపీలో బీజేపీ..జనసేన కలిస్తే ఏమయ్యే అవకాశం ఉందని చర్చించారు. తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కానీ, అందులో ఇద్దరు ఒకే అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో కేంద్రంతో ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దాని పైన ఇద్దరు సీఎంలు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
జగన్ కు కేసీఆర్ కీలక సూచనలు: మూడు రాజధానులపైనా ఇలా: గెలుపే పరిష్కారం...!
జనసేన..బీజేపీ పొత్తు గురించి..
ఏపీ..తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్..కేసీఆర్ ప్రగతి భవన్ లో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఆ సమయంలో అనేక అంశాల పైన వారు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. వారి సమావేశం సమయంలో ఏపీ లో రాజకీయ పరిస్థితుల పైన చర్చ జరిగింది. అదే సమయంలో ఢిల్లీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్..బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతో సమావేశమయ్యారు. ఏపీలో రెండు పార్టీలు కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నారు. దీని పైన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ప్రస్తావనకు వచ్చింది.
ప్రధాన ప్రతిపక్షాల పాత్రపై
ఏపీలో జనసేనతో కలిసి ప్రజల్లోకి వెళ్లటానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇది అంత ఫలవంతం కాకపోవచ్చని ఇరువురు ముఖ్య మంత్రులు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశాలు లేవని కేసీఆర్ స్పష్టం చేసారు. ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నా.. ఆ రెండు పార్టీలకు ప్రజల్లో రోజురోజుకు ఆదరణ తగ్గుతోందనే అంచనాకు వచ్చినట్టు సమాచారం.
రాజకీయంగానే ఎదుర్కోవాలి..
ఇక, కేంద్రం..బీజేపీ నిర్ణయాలు..భవిష్యత్ పైన ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించినట్లు సమాచారం. రాష్ట్రాల అభివృద్ధి, నిధుల విడుదల విషయంలో కేంద్రం పూర్తిగా సహకరించటం లేదనే అభిప్రాయం ఇద్దరు సీఎంలు వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం విడివిడిగానే కాకుండా.. పార్లమెంటు వేదికగా కలిసి పోరాడాలని వారు నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగనంతవరకు కేంద్రంతో తగవు పడాల్సిన అవసరంలేదని ఇద్దరు సీఎంలు నిర్ణయించినట్లు సమాచారం.
ఎత్తుగడలతోనే
అదే సమయంలో రాజకీయంగా ఆ పార్టీ వేస్తున్న ఎత్తుగడలను రాజకీయంగానే ఎదుర్కొవాలని ఒక నిర్ణయాని కి వచ్చారు. జాతీయ స్థాయిలో బీజేపీ బలం క్రమక్రమంగా తగ్గుతోందని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తాయనే నమ్మకాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ బలంగా వినిపించినట్టు తెలిసింది. ఇక ముందు జాతీయ రాజకీయాలపై వేచి చూసే ధోరణిని ప్రదర్శించాలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.