మరోసారి కేసీఆర్..జగన్ భేటీ: 13న ముహూర్తం ఖరారు: అమరావతిపై ఆయన చెప్పిందే...!
సుదీర్ఘ విరామం తరువాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ నెల 13న హైదరాబాద్ లో ఈ సమావేశం జరగనుంది. ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరు వాత జగన్ హైదరాబాద్ వెళ్లి కేసీఆర్ తో సమావేశం అవ్వటం.. అదే విధంగా పలుమార్లు కేసీఆర్ అమరావతి రావటం జరిగింది. ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో అనేక పెండింగ్ అంశాలు ఉన్నాయి. కొన్ని పరిష్కారం కాగా..క్లియర్ అవ్వాల్సిన అంశాలు ఉన్నాయి.
ప్రధానంగా..గోదావరి జలాలను తెలంగాణ మీదుగా రాయలసీమకు తరలించే ప్రతిపాదనల మీద అర్దాంతరంగా చర్చలు ఆగిపోయాయి. తిరిగి..ఇప్పుడు సమావేశం కానున్నారు. అయితే, ఈ సారి ప్రధానంగా కేంద్రంతో సంబంధాలతో పాటుగా ఏపీలో కీలక అంశంగా మారిన మూడు రాజధానుల అంశం పైనా చర్చ చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో కేసీఆర్ సైతం అమరావతిలో పెట్టుబడిని డెడ్ ఇన్వెస్ట్ మెంట్ గా అభివర్ణించారు. ఇప్పుడు జగన్ సైతం అదే అభిప్రాయంతో ఉన్నారు. దీంతో..ఈ సారి ఈ ఇద్దరి సమావేశం కీలకంగా మారనుంది.
మరోసారి ఇద్దరు సీఎంల సమావేశం..
మరోసారి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఇందు కోసం ఈ నెల13వ తేదీన ముహూర్తంగా నిర్ణయించారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరగనుంది. జగన్ సీఎం అయిన సమయం నుండి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. అయితే, నాలుగు నెలల క్రితం నుండి ఇద్దరి మధ్య తరచుగా జరిగే సమావేశాలకు బ్రేక్ పడింది. దీంతో..ఇద్దరి సీఎంల మధ్య గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం సాగింది. ఆర్టీసీని ఏపీలో ప్రభుత్వంలో విలీనం చేయటం..తెలంగాణలో అదే అంశం సాధ్యం కాదని కేసీఆర్ చెప్పటం ఆ సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య దూరం పెంచాయనే అభిప్రాయానికి కారణమయ్యాయి. ఇక, దిశ చట్టం పైన ఏపీ అసెంబ్లీ సీఎం జగన్ మాట్లాడే సమయంలోనూ తెలంగాణ ముఖ్యమంత్రికి హాట్సాఫ్ చెప్పారు. ఇవన్నీ జరిగిన తరువాత తిరిగి ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ఆసక్తి కరంగా మారుతోంది.
కేసీఆర్ కు సీఎం జగన్ అరుదైన అవకాశం: ఏపీలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఇలా..!
అమరావతిపైన నాడు కేసీఆర్..
ఇప్పుడు ఏపీలో రాజధాని వ్యవహారం రాజకీయంగా కీలక అంశంగా మారింది. ప్రభుత్వ ఆలోచనను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇదే సమయంలో ముందుకే వెళ్లే విధంగా ముఖ్యమంత్రి అడుగులు కనిపిస్తు న్నాయి. ఇక, ఇదే అంశం పైన కేసీఆర్ గతంలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు అప్పట్లోనే ప్రచారం సాగింది. అమరావతిలో పెట్టుబడి పెడితే అది డెడ్ ఇన్వెస్ట్ మెంట్ అవుతుందంటూ చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు జగన్ సైతం అదే భావన అసెంబ్లీలోనే వ్యక్తం చేసారు. దీని పైన ఇద్దరి సమావేశంలో కేసీఆర్ ఏపీలో జగన్ ప్రతిపాదనల పైన తన అభిప్రాయ చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఇక, జాతీయ స్థాయిలో పౌరసత్వ బిల్లుకు వైసీపీ అనుకూలగా ఓటింగ్ చేసినా..ఎన్నారై విషయంలో మాత్రం ఏపీలో అమలు చేయమని స్పష్టం చేసారు. ఇక, టీఆర్ యస్ మాత్రం ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటింగ్ చేసింది. జాతీయ స్థాయిలో జరుగుతన్న పరిణామాలు ఈ ఇద్దరు చర్చించే పరిస్థితి కనిపిస్తోంది.
పెండింగ్ అంశాల పైనా..
ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న అంశాల పైనా ఇద్దరు చర్చించనున్నారు. గోదావరి జలాలను తెలంగాణ మీదుగా సీమకు తరలించే అంశం పైన గతంలో ప్రతిపాదనల పైన చర్చ జరిగింది. ఇప్పుడు ఈ సమావేశంలో దీనిని కొనసాగింపుగా చర్చ జరుగుతుందా లేదా అనేది కీలక అంశంగా మారింది. ఇక, విద్యుత్ ఉద్యోగుల సమస్యలు.. ఆర్టీసీ తుది విభజన...వంటి అంశాల పైన చర్చ జరగే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే, మధ్యలో వచ్చిన గ్యాప్ తరువాత ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం అవుతుండటంతో రాజకీయంగానూ ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.