లాక్ డౌన్ ఎత్తివేతపై కేసీఆర్ అలా.. జగన్ ఇలా... కారణాలు ఇవే..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేయాలా లేక కొనసాగించాలా అన్న దానిపై అన్ని మథనం కొనసాగుతోంది. కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా దీనిపై నిశ్చితాభిప్రాయానికి రాలేకపోతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ ఎత్తివేతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనికి ఎవరికి వారికి సొంత అభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video
లాక్ డౌన్ ఎత్తివేతపై భిన్నాభిప్రాయాలు.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తివేతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్రం కూడా హడావిడిగా ఏదో ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్దితి. మరికొన్ని రోజులు లాక్ డౌన్ కొనసాగితే దేశవ్యాప్తంగా ఆర్దిక రంగం గడ్డు పరిస్దితులు ఎదుర్కోక తప్పదనే అంశంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్ధిక పరిస్ధితిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్ధితి. ఇదే పరిస్ధితి తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది.
కేసీఆర్ అలా.. జగన్ అలా..
ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేత విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకుంటే 14 తర్వాత లాక్ డౌన్ కొనసాగిస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని నిన్న ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. అయితే ఏపీలో మాత్రం లాక్ డౌన్ కొనసాగింపు రెడ్ జోన్లకే పరిమితం చేయాలని భావిస్తున్న వైసీపీ సర్కారు అభిప్రాయాన్ని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
ఆర్ధిక పరిస్ధితే కారణం..
ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్ధితుల్లో ఇరు రాష్ట్రాలూ ఆర్దికంగా ఎంతో నష్టపోయాయి. దీన్నుంచి కోలుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అయితే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏదోరకంగా నడిపించడానికి అవసరమైన ఆర్ధిక వనరులు ఉండగా.. ఏపీలో మాత్రం పరిస్ధితి దారుణంగా ఉంది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో నెలవారీ చెల్లింపులకే డబ్బులు లేని వేళ... ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ కొనసాగింపుపై ముందునుంచీ వ్యతిరేకంగానే కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా పూర్తికాకపోవడంతో ఉద్యోగుల్లో వ్యతిరేకత వస్తుందన్న భయమో ఏమో కానీ సీఎం జగన్.. జీతాల్లో కోతకు బదులుగా వాయిదా వేసి ఊపిరి పీల్చుకున్నారు.
లాక్ డౌన్ కొనసాగితే...
తెలంగాణ పరిస్ధితి ఎలా ఉన్నా ఏపీలో లాక్ డౌన్ కొనసాగితే మాత్రం ఆర్దిక పరిస్ధితి తీసికట్టుగా తయారవుతుందన్న అంచనాలు ఉన్నాయి. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు చెల్లింపులు చేయలేని పరిస్ధితి ఎదురవుతుంది. అలాగే దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్ధితి వస్తుంది. అప్పుడు రోజువారీ చెల్లింపులను కూడా చేయలేని పరిస్ధితికి రాష్ట్రం దిగజారిపోతుందనే అంచనాలు ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అందుకే లాక్ డౌన్ ను రెడ్ జోన్లకే పరిమితం చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తోంది.