'హోదా ఇవ్వనందుకు మోడీకి బాబు థ్యాంక్స్, అసలు ఏపీని ఏం చేస్తావ్'
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.
తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారన్నారు. ఏపీకి హోదా ఇవ్వడం లేదని చెప్పినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పారా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వైఖరిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
పోలవరం కాంట్రాక్టు కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. కేంద్ర పరిధిలో ఉన్న ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. టెండర్లు లేకుండా పోలవరం ప్రాజెక్టుకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చారన్నారు.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సబ్ కాంట్రాక్టులు డిసైడ్ చేయడం ఏమిటన్నారు. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమని చెప్పారు. పోలవరం మెయిన్ ప్రాజెక్టును పక్కకు పెట్టి ఇప్పుడు కాపర్ డ్యాం నిర్మిస్తున్నామని, అసలు చంద్రబాబు ఆలోచన ఏమిటని, రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారన్నారు.
పోలవరం ప్రాజెక్టు వల్ల అంతర్రాష్ట్ర వివాదాలు వచ్చే అవకాశముందని, అలా వస్తే మీరు ఏం చేస్తారని నిలదీశారు. మీ దోపిడీని అడ్డుకుంటే పోలవరానికి, రాజధాని నిర్మాణానికి ప్రతిపక్షం అడ్డు తగులుతోందని రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. పోలవరం కోసమే ప్యాకేజీ అంటూ హంగామా చేశారన్నారు.
తాబేదర్లకు, బూట్లు మోసేవారికి, సంచులు మోసేవారికి చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కుంభకోణం కేసులో దొంగలా దొరికిన చంద్రబాబు అందులో నుంచి బయటపడేందుకు బీజేపీకి ప్రత్యేక హోదాను అమ్మనేశారన్నారు. బీజేపీకి అమ్ముడుపోయాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రకటించిన ప్యాకేజీ పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో చర్చకు సిద్ధమని బొత్స చెప్పారు. హోదా సంజీవిని అని, సాధించే వరకు తాము పోరాటం చేస్తామన్నారు. ప్యాకేజీని చంద్రబాబు ఎలా స్వాగతించారో అర్థం కావట్లేదన్నారు.