జేసీకి బొత్స దిమ్మతిరిగే కౌంటర్, మేం సిద్ధం కానీ పవన్ కళ్యాణే తేల్చుకోవాలి.
అమరావతి: ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మార్చి 6వ తేదీన తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటనపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. దీనిపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ధీటుగా స్పందించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ముందు ప్లకార్డులు పట్టుకోలేని వాళ్లు రాజీనామా చేస్తారా, అది ఎలా నమ్మాలి, ప్రజలు ఎలా నమ్ముతారు అని టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. జగన్ రాజీనామా ప్రకటన అంతా డ్రామా అని, ఇప్పుడు ఎవరు నమ్ముతారని, వాటి ఆమోదానికే రెండు నెలల సమయం పడుతుందని జేసీ అన్నారు. వీరి వ్యాఖ్యలపై బొత్స స్పందించారు.
మా ఎంపీల రాజీనామాతో
ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని బొత్స చెప్పారు. ప్యాకేజీకి అర్థంలేదన్నారు. జిల్లాల్లోను తాము హోదా కోసం ఉద్యమం తీసుకు వస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాతోనే ఏపీకి ప్రయోజనం అన్నారు. నాలుగేళ్లుగా తాము హోదా కోసం ధర్నాలు చేస్తుంటే అడ్డుకుంటున్నారన్నారు. మా ఎంపీల రాజీనామాలతో దేశం మొత్తం ఏపీ ఆకాంక్షను గుర్తిస్తుందన్నారు.
పవన్ కళ్యాణ్ గురించి అడిగితే.. కలిసి వచ్చే వారితో
జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి పని చేస్తారా అంటే.. హోదా కోసం కలిసి వచ్చే వారితో పోరాటం చేస్తామన్నారు. టీడీపీ మిత్రపక్షంగా జనసేన తేల్చుకోవాలన్నారు. మాకు ఏ పార్టీ మద్దతిచ్చినా స్వాగతిస్తామన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కలిసి వస్తే కలుపుకుపోతామన్నారు.
కేంద్రం దిగి రాకుంటే చూస్తారుగా
ఎంపీల తర్వాత, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా అని అడిగితే.. మా కార్యాచరణ చూస్తారుగా అని బొత్స చెప్పారు. ఎంపీల రాజీనామాకు కేంద్రం దిగిరాకపోతే చూస్తారుగా అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పుడే తాము అది వద్దని, హోదా కావాలని చెప్పామని తెలిపారు. హోదా సంజీవిని అని తమ పార్టీ భావిస్తోందని, అందుకే గ్రామాల్లోకి వెళ్తామని, అప్పుడు ఉద్యమం ఉధృతం అవుతుందన్నారు.
జేసీ, కొనకళ్లలకు బొత్స కౌంటర్
తమ రాజీనామా ప్రకటన డ్రామాలు అన్న టీడీపీ ఎంపీలు కొనకళ్ల, జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నిన్న గాక మొన్ననే వైసీపీ ఎంపీలకు దమ్ముంటే రాజీనామాలు చేయాలని టీడీపీ అన్నదని బొత్స గుర్తు చేశారు. రాజీనామాలు చేయమని చెప్పి, ఇప్పుడు డ్రామాలు అనడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు మాట ఎందుకు మార్చుతున్నారని ప్రశ్నించారు.
ఎందుకు ఊరేగిస్తున్నారు
తమకు ఎన్నికలు ప్రధాన అంశం కాదని, ఏపీ ప్రయోజనాలు ముఖ్యమని బొత్స చెప్పారు. టీడీపీ ఎంపీల డ్రామాలతో రాష్ట్రానికి నష్టమని, ఏం సాధించారని వారిని ఊరేగిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు 13 రోజులుగా (బడ్జెట్లో అన్యాయం జరిగిందని చెప్పినప్పటి నుంచి) ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు.