బాబూ! రాజీనామా చెయ్, ఓటుకు నోటులో 48సార్లు నీ పేరు, కేసీఆర్తో లాలూచీ'
కేసీఆర్ ప్రభుత్వంతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లాలూచీ పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ గురువారం నాడు మండిపడ్డారు.
అమరావతి: కేసీఆర్ ప్రభుత్వంతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లాలూచీ పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ గురువారం నాడు మండిపడ్డారు.
ఓటుకు నోటు కేసులో మొదటి ఛార్జీషీటులో 26సార్లు, రెండో ఛార్జీషీటులో 22సార్లు చంద్రబాబు పేరు ఉందని బాంబు పేల్చారు. దీనిపై ప్రజలకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. మీరు నిప్పా లేక తుప్పా అన్నారు.
కృష్ణా జలాల్లో రాజీ
కృష్ణా జలాల విషయంలో చంద్రబాబు ఎలా రాజీపడ్డారో ప్రజలు ఆలోచించాలని బొత్స అన్నారు. ప్రత్యేక హోదాను ప్యాకేజీగా మార్చిన విషయం గుర్తించాలన్నారు. ఛార్జీషీటులో పేరున్న వ్యక్తి సీఎంగా కొనసాగిన దాఖలాలు లేవన్నారు.
గొంతు తనది కాదని చెప్పలేదు
చంద్రబాబుకు నైతిక విలువలు, రాజ్యాంగం పైన గౌరవం ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేయాలని బొత్స డిమాండ్ చేశారు. ఆడియో టేపుల్లో ఉన్న గొంతు తనది కాదని చంద్రబాబు ఇప్పటి వరకు చెప్పలేదన్నారు.
విజయవాడ పారిపోయారు
ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలంటే చంద్రబాబు తప్పుకోవాల్సిందేనని బొత్స అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తక్షణం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఓటుకు నోటు తెరపైకి రాగానే చంద్రబాబు హైదరాబాద్ వదిలి విజయవాడ పారిపోయారన్నారు.
లాలూచీపడ్డారు
తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీపడి ఏపీ ప్రయోజనాలను గాలిసి వదిలేశారని బొత్స సత్యనారాయణ అన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే ఆయన హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు. చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని పరిపాలన చేస్తారన్నారు.