ఐదేళ్లలో 5 శాతం పనులు చేయలేదు.. చంద్రబాబుపై బొత్స విసుర్లు
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో ఏం చేశారని ఆయన నిలదీశారు. ఊరికేనే కాలం వెళ్లదీశారని మండిపడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంత రైతుల కోసం ఏమీ చేయలేదు అని ఫైరయ్యారు.
గత ప్రభుత్వ హయాంలో కృష్ణానది కరకట్ట రోడ్డు కూడా వేయలేదని బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఐదేళ్లలో ఐదు శాతం పనులు కూడా చేయలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు బాధ బినామీల కోసమని.. అమరావతి రాజధాని ప్రాంత రైతుల కోసం కాదని ఆరోపించారు. సచివాలయ భవనాల కోసం చదరపు అడుగుకు రూ.10 వేలు ఖర్చు చేసి తాత్కాలికం అనడం ఏంటీ అన్నారు.
గత హయాంలో చంద్రబాబు సచివాలయం నిర్మించరా..? పేదలకు ఒక్క ఇళ్లయినా ఇచ్చారా? అని బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. కానీ తాను మాత్రం హైదరాబాద్లో ఇంటి నిర్మాణం మాత్రం పూర్తి చేసుకున్నారని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఎంత దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు అని గుర్తుచేశారు.
Recommended Video
రాజధాని కోసం చేసిన అప్పులు, ఎంత తిన్నదీ కూడా తెలుసు అని బొత్స చెప్పారు. రూ.1.50 లక్షల కోట్ల మేర అంచనాలు రూపొందించి, రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వెల్లడించారు. కానీ వైసీపీకి ఇదే చివరి అవకాశం అని దుష్ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న సీఎం జగన్ను ప్రజల మనసుల్లో ఉన్నారని పేర్కొన్నారు.