బొత్స ఝాన్సీ డుమ్మా: కావూరి, చిరు, కెవిపి హాజరు
ఆ సమావేశానికి హాజరు కావడం ఇష్టంలేని బొత్స ఝాన్సీ సమావేశం ప్రారంభం కావడానికి ముందే మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. దీంతో బొత్స ఝాన్సీ సమైక్యాంధ్ర ఉద్యమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
సమావేశానికి సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివ రావు, చిరంజీవి, దగ్దుబాటి పురంధేశ్వరి, పళ్లం రాజుస, జెడి శీలం హాజరయ్యారు. పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, కనమూరి బాపిరాజు, కెవిపి రామచంద్రరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. పార్లమెంటు సభ్యులు చింతా మోహన్, రాయపాటి సాంబశివ రావు సమావేశానికి రాలేదు.
సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు ఆమోదింపజేసుకోవాలా, లేదా అనే విషయంపై సీమాంధ్ర పార్లమెటు సభ్యుల్లో ఏకాభిప్రాయం లేదని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. ఏడుగురు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రాజీనామాలను ఆమోదింపజేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు లగడపాటి రాజగోపాల్ సమావేశానికి ముందు చెప్పారు. కొంత మంది సీమాంధ్ర కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.