వంగవీటి రంగా హత్యకు కోడెల పన్నాగమని..: బాబుపై దుమ్మెత్తిపోసిన బొత్స
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైసిపి నేత బొత్స సత్యనారాయణ మంగళవారం నాడు దుమ్మెత్తి పోశారు. సభాపతి కోడెల శివప్రసాద్ రావు పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఎన్టీఆర్ ఒత్తిడి చేయడం వల్లే రాజీనామా చేశారన్నారు.
కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారన్నారు. కాపు సోదరుడు ఒకరు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఎన్నికలు ప్రతి అయిదేళ్లకు వస్తాయని, కానీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు.
ఎవరైనా మాట్లాడితే అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సమాజంలోని ఓ వ్యక్తి ఆర్థిక స్థితిగతులు ఓ కులంపై ఆధారపడి ఉంటాయని ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ విధానంలోనే లోపం ఉందని చెప్పారు. ప్రభుత్వ శాఖల మీద బాబుకు పట్టు లేదన్నారు. దాంతో అధికారుల ముందు పలుచనైపోయారన్నారు.
గతంలో ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి మీరు సంఘీభావం తెలపలేదా అని ప్రశ్నించారు. తుని ఘటన వెనుక టిడిపిదే ప్రధాన భూమిక అని ముద్రగడ చెప్పారన్నారు. దీనిపై అవాకులు, చెవాకులు మాని వివరణ ఇవ్వాలని సూచించారు. తుని ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. కాపులకిచ్చిన హామీని నెరవేర్చాలన్నారు.
వంగవీటి రంగా హత్య జరిగినప్పుడు కోడెల శివప్రసాద రావు హోంమంత్రిగా ఉన్నారని చెప్పారు. ఆయన పన్నాగం పన్నారని నిరసనలు వెల్లువెత్తాయన్నారు. ఆ ఘటనకు బాధ్యతగా తాను రాజీనామా చేశానని కోడెల చెప్పడం విడ్డూరమన్నారు.
ఆయన ఎందుకు రాజీనామా చేశారో తెలుసునని అభిప్రాయపడ్డారు. నాడు ఎన్టీఆర్ బర్తరఫ్ చేస్తానని చెబితే రాజీనామా చేశారన్నారు. ఇది అబద్దమా అన్నారు. కోడెల వ్యాఖ్యలు సరికాదన్నారు. వ్యక్తుల కంటే పదవుల పైన గౌరవం ఉంటుందని చెప్పారు.
నేను కూడా అయిదేళ్ల పాటు ఎంపీగా, పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పారు. ఎంతోమంది సభ్యులను చూశామని, కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంత వరకు చూడలేదన్నారు. మీరెంత బాగా పాలిస్తున్నారో ప్రజలు చెప్పాలని, మీకు మీరు డబ్బ కొట్టుకోవడం కాదన్నారు.