శ్రీనివాసరావును మోసుకెళ్తున్నారు.. ఏంజరుగుతోంది, హత్యాయత్నం చిన్న విషయంకాదు : బొత్స, మేకపాటి
న్యూఢిల్లీ: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస రావుకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ, మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. అక్కడ జరిగిన ఘటనకు నిందితుడే ప్రత్యక్ష సాక్షి అన్నారు.
Recommended Video
అతను సీఎం సన్నిహితుడు, గడ్డి తింటున్నారా: రోజా, చంద్రబాబు-డీజీపీ కాల్ డేటా రావాలి: ఆర్కే
ఈ కేసులో అసలు నిందితులు బయటకు రావాలంటే శ్రీనివాస రావు ప్రాణాలు కాపాడాల్సి ఉందని చెప్పారు. అతను ఏపీ పోలీసుల ఆదీనంలో ఉన్నాడని, అతని ప్రాణాలపై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. మొదట అతను ప్రాణాలతో ఉంటే, ఆ తర్వాత అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు.
ఏపీలో ప్రమాదకర రాజకీయాలు
ఏపీలో ప్రమాదకరమైన రాజకీయాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు అన్నారు. శ్రీనివాస రావుకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిదే అన్నారు. కుట్ర వెనుక టీడీపీ పెద్దలు ఉన్నారని, అందుకే థర్డ్ పార్టీ విచారణకు అంగీకరించడం లేదని చెప్పారు. వాస్తవాలు బయటకు రావడం కోసం శ్రీనివాస రావు ఆరోగ్యంగా ఉండాలన్నారు.
అతనికి హాని జరిగే అవకాశముంది
జగన్ పైన దాడి ఘటనకు సాక్షి.. నిందితుడు శ్రీనివాస రావే అని వైసీపీ నేతలు అన్నారు. అతనికి ఏదైనా హాని జరిగే అవకాశముందని తాము మొదటి నుంచి చెబుతున్నామన్నారు. ఏపీలో ప్రమాదకర రాజకీయాలు ఉన్నాయని ఆరోపించారు. జగన్ పైన హత్యాయత్నం వెనుక చంద్రబాబు, లోకేష్, టీడీపీ పెద్దలు ఉన్నారని ఆరోపించారు.
భుజాలపై మోసుకెళ్తున్నారు.. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు
కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని బొత్స, మేకపాటి అన్నారు. థర్డ్ పార్టీ విచారణతోనే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. తాము రాజ్యాంగ పరిధిలోనే పోరాటాలు చేస్తున్నామని చెప్పారు. శ్రీనివాస్ను చూస్తే భుజాలపై మోసుకెళ్తున్నారని, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. శ్రీనివాస్ వెనుక ఉన్నది ఎవరో తెలియాలన్నారు.
జగన్పై హత్యాయత్నం చిన్న విషయం కాదు
అవసరమైతే తాము మరోసారి కేంద్ర హోంమంత్రిని కలుస్తామని వైసీపీ నేతలు చెప్పారు. ఏపీలో హత్యా రాజకీయాలు దారుణం అన్నారు. జగన్ పైన హత్యాయత్నం చిన్న విషయం కాదన్నారు. శ్రీనివాస్ బాధ్యత ప్రభుత్వానిదేనని, అతనిని ఏమైనా చేస్తారేమోననే అనుమానం కలుగుతోందన్నారు.సాక్ష్యాలను సమాధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నేతలు మేకపాటి, బొత్స అన్నారు. సూత్రధారులు ఎవరో చెప్పాల్సిన వ్యక్తికే ప్రాణహానీ ఉందన్నారు. ప్రాణహానీ ఉందని శ్రీనివాస రావే చెబుతున్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చునని అన్నారు. జగన్ పైన దాడి సూత్రధారులు బయటపడాలంటే శ్రీనివాస్ బతికుండాలన్నారు. కుట్రపన్నింది టీడీపీయే కాబట్టి థర్డ్ పార్టీ విచారణకు ఒప్పుకోవడం లేదన్నారు.