రాజ్యసభ రేసులో బొత్స, పనబాక: ఓటింగ్ జరగనుందా?
హైదరాబాద్: రాజ్యసభ రేసులో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రులు పళ్లం రాజు, పనబాక లక్ష్మిలు కూడా ఉన్నారట. తమకు రాజ్యసభ సీట్లు కేటాయించాలని వారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లారట. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ బృందంలో పని చేస్తున్న మాజీ ఐఎఎస్ అధికారి కొప్పుల రాజు కూడా రాజ్యసభ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన విషయంలో బొత్స, పనబాకలు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్న విషయం తెలిసిందే.
రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్న ప్రస్తుత సభ్యులు ఎంఎ ఖాన్, కెవిపి రామచంద్ర రావు, రత్నాబాయి, టి సుబ్బిరామి రెడ్డి, నంది ఎల్లయ్యలు తమకు మరోసారి అవకాశం కల్పించాలని పార్టీ హైకమాండ్ను కోరుతున్నారు. వీరిలో ఎంఎ ఖాన్, కెవిపి, రత్నాబాయిలకు మళ్లీ సీట్లు లభించే అవకాశాలు అధికంగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న ఆరు సీట్లలో కాంగ్రెస్కు మూడు, తెలుగుదేశం పార్టీకి రెండు సీట్లు గెలిచే అవకాశాలున్నాయి. ఆరో సీటు వ్యవహారం కొంత గందరగోళంగా ఉన్నా కాంగ్రెస్, టిఆర్ఎస్ చేతులు కలిపితే ఉమ్మడి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది.
కాంగ్రెస్, తెరాసల మధ్య అవగాహన కుదరని పక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన అభ్యర్థిని రంగంలోకి దింపితే పోలింగ్ జరపాల్సి ఉంటుంది. తెరాస తరఫున మాజీ ఎంపి కె కేశవ రావు రాజ్యసభ బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ తరపున రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థుల జాబితాను ఈనెల 25న ప్రకటించే అకవాశాలున్నాయి.