ఇప్పుడేం లాభం: కిరణ్ రిజైన్పై బొత్స, ధర్మానకి కౌంటర్
అంతా అయ్యాక రాజీనామా చేస్తే కేంద్రం నిర్ణయాల పైన ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ఇప్పుడు రాజీనామా చేస్తే ఎన్నికలను ఎదుర్కొనే బాధ్యతలను విస్మరించడమేనన్నారు. సిడబ్ల్యూసి నిర్ణయమప్పుడే సమష్టిగా రాజీనామాలు చేద్దామని తాను చెప్పానని అన్నారు. తమ ప్రాంత ప్రజల అభిప్రాయాలు చెప్పేందుకే ఢిల్లీలో తాము దీక్ష చేశామన్నారు.
మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరినంత మాత్రాన సమైక్యవాది అవుతారా అని ప్రశ్నించారు. జగన్ పార్టీ ఇచ్చిన లేఖ విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం పార్టీని వీడే వారి వల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ చివరి దశలో ఉందన్నారు.
ఆఖరి నిమిషంలో రాజీనామా చేస్తే లాభమేమిటని చురకలు అంటించారు. బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపినప్పుడో, రాష్ట్రానికి వచ్చినప్పుడో రాజీనామా చేస్తే బాగుండేదన్నారు. తానో, మరొకరో ఇప్పుడు రాజీనామా చేయడమంటే ఎన్నికల బాధ్యతల నుండి తప్పుకోవడమే అవుతుందన్నారు. సిఎం ఢిల్లీ దీక్షను అధిష్టానం సీరియస్గా తీసుకోలేదన్నారు.
సీమాంధ్ర ఆందోళనలకు అక్కడి కాంగ్రెసు పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. జలయజ్ఞం నిధుల వ్యవహారంపై సిఎస్ వివరణ కోరానని, జలయజ్ఞం ప్రాజెక్టులకు నిధులు పెంచడంపై మంత్రి వర్గంలో చర్చించ ఉంటే బాగుండేదని బొత్స అభిప్రాయపడ్డారు.
సోనియాతో డిఎస్ భేటీ
రాబోయే రెండు, మూడు రోజుల్లో పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని పిసిసి మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఎపి భవన్లో ధర్నా చేపట్టిన టిజెఏసి నేతలకు డిఎస్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్లు విషయంలో బిజెపిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. సంపూర్ణ తెలంగాణ కోసం ఒత్తిడి తెస్తున్నామన్నారు. తెరాసతో తమకు ఎప్పటికీ సన్నిహిత సంబంధాలు ఉంటాయన్నారు.
బిల్లు ఆమోదం: విద్యాసాగర రావు
పార్లమెంటులో తెలంగాణ బిల్లు తప్పక ఆమోదం పొందుతుందని, బిజెపిపై ఎలాంటి అనుమానాలొద్దని ఆ పార్టీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు.