త్వరలో మరో ఎన్నికల జాతర ... అధికారులను పరుగులు పెట్టించే పనిలో మంత్రి బొత్సా
మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు మున్సిపల్ అధికారులు ప్రజాసమస్యల పరిష్కారం కోసం పని చేయాలని, అధికారులు ఎవరైనా ఏ సమయంలోనైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఫోన్ లిఫ్ట్ చేస్తే సగానికి పైగా ప్రజా సమస్యలు పరిష్కరించినట్లేనని చెప్పిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మున్సిపల్ ఎన్నికల గురించి ప్రస్తావించి అధికారులను పరుగులు పెట్టించే పనిలో పడ్డారు.
మున్సిపల్ కమీషనర్ల వర్క్ షాప్ ను ప్రారంభించిన బొత్సా సత్యన్నారాయణ
విజయవాడలో రాష్ట్రస్ధాయి మున్సిపల్ కమిషనర్ల రెండు రోజుల వర్క్ షాపు సమావేశాలను ప్రారంభించిన బొత్స సత్యనారాయణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల పాలన గత ప్రభుత్వం చేసిన అవినీతి ప్రక్షాళనకే సరిపోయిందన్నారు. ఇక మున్సిపల్ అధికారులను ఉద్దేశించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో కి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన తెలిపారు. ఎక్కడ, ఎవరికి, ఎలాంటి సమస్య ఉన్న సత్వర పరిష్కారం అందించేలా మున్సిపల్ అధికారులు పనిచేయాలని ఆయన కోరారు.
అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్న బొత్సా
మున్సిపల్ శాఖ అధికారులు కోరుకున్న స్థానంలోనే ప్రభుత్వ బదిలీలు జరిగినట్లు చెప్పారు బొత్స సత్యనారాయణ. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలపట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు మంత్రి బొత్స. ఇక అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఏ సమయంలో ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయాలని తేల్చి చెప్పారు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే సగానికిపైగా సమస్యలు పరిష్కరించినట్లేనని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.
అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచాలన్న మంత్రి
ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ళిచ్చే ప్రక్రియ వేగవంతం చేయాలని బొత్స సత్యనారాయణ ఆదేశించారు.జలశక్తి అభియాన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో ఉన్నామని బొత్స సత్యనారాయణ తెలిపారు.శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టులుగా తీసుకున్నామని చెప్పిన ఆయన ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి అన్నారు. మున్సిపల్ శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులలో స్పీడ్ పెంచాలని, అక్టోబర్ 2 నుండి అక్రమకట్టడాలు లేకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు .
డిసెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతుందన్న బొత్సా
డిసెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోందని బొత్స పేర్కొన్నారు.నవంబర్ నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది అని చెప్పిన బొత్స సత్యనారాయణ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఓట్లు అడగాలి అంటే అధికారులు సరైన పనితీరును కనబరచాలని, ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు. అవినీతికి ఆస్కారం లేని పాలన చేయాలని, తెలిసి అధికారులు ఎలాంటి తప్పులు చేయకూడదని బొత్స సత్యనారాయణ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. మొత్తానికి ఏపీలో త్వరలో మరో ఎన్నికల జాతరకు రంగం సిద్ధమవుతున్నట్టు బొత్స తన వ్యాఖ్యల ద్వారా తెలియజేశారు.