‘జేపీ నడ్డా వచ్చినా.. పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు? కరెన్సీ అందలేదా?.. చంద్రబాబుది పాత జిమ్మిక్కే’
చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు పెద్ద డ్రామాకు తెరలేపారని, రాళ్ల దాడి జరిగిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబుది పబ్లిసిటీ డ్రామా
మంగళవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే చంద్రబాబు పబ్లిసిటీ డ్రామా ఆడుతున్నారని, వైసీపీని ఎదుర్కోలేకే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు. టీడీపీ, బీజేపీలకు జెండా ఉంది కానీ, అజెండా లేదని అన్నారు. చంద్రబాబుకు ఏం చేయాలో తెలియక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు ఏం చేశారో చెప్పుకునే స్థితిలో టీడీపీ లేదన్నారు. టీడీపీ పనైపోయిందని.. ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారని చెప్పారు.
జేపీ నడ్డా వచ్చినా.. పవన్ కళ్యాణ్ రాలేదు.. కరెన్సీ అందలేదనే..
కరోనా కారణం చెప్పి జేపీ నడ్డాతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రచారం చేయలేదని చెప్తున్నారని.. పవన్ కరోనాకు భయపడి క్వారంటైన్ కు వెళ్లారో? లేక కరెన్సీ అందలేదని క్వారంటైన్ కు వెళ్లారో తెలియదని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి బీజేపీ ఏ మేలు చేసిందో జేపీ నడ్డా చెప్పలేదన్నారు. వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు గురించి కూడా జేపీ నడ్డా మాట్లాడలేదన్నారు. ఎన్నిసార్లు విన్నవిన్న వించినా పోలవరం అంచనాలు ఆమోదించలేదన్నారు. ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేని టీడీపీ, బీజేపీలకు అడిగే హక్కు లేదన్నారు.
చంద్రబాబు పాత జిమ్మిక్కులు
మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
చంద్రబాబు పాత జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు. మొన్న పరిషత్ ఎన్నికలు బహిష్కరించామని, రాళ్ల దాడి జరిగిందంటూ కొత్త డ్రామాకు తెరతీశారన్నారు. తిరుపతి ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని గ్రహించిన చంద్రబాబు.. రాళ్ల దాడి డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. దాడికి సంబంధించిన ఆధారాలు లేవని పోలీసులు చెబుతున్నారన్నారు. ప్రజలు తోక కత్తిరించినా చంద్రబాబు బాష మారలేదని, లోకేష్ గురించి అచ్చెన్నాయుడు నిజం మాట్లాడారని అన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీకి 85 శాతం ఓట్లు వస్తాయన్నారు. చంద్రబాబు ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోరాడాలని సవాల్ విసిరారు మంత్రి బొత్స.