ఒక్కటౌదాం, సకలం బంద్: బాబుకు బొత్స, మోడీని నమ్మాం: బోండ
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మనమంతా ఒక్కటవుదామని, కేంద్రం పైన ఉద్యమిద్దామని, ఇందుకోసం సకలం బంద్ చేద్దామని వైసిపి నేత బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురువారం సూచించారు. పొరుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను చూసి ప్రాంతీయ భావాన్ని నేర్చుకోవాలన్నారు.
కేంద్రం దిగి వచ్చేలా అందరం ఒక్కతాటి పైకి వచ్చి సకలం బంద్ చేద్దామని బొత్స అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యమని చెప్పారు. ప్రత్యేక హోదా పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ధర్నాలు చేస్తుందన్నారు. ఈ ధర్నాల్లో తమ పార్టీ అధినేత జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పాల్గొంటారని చెప్పారు.
ఈ నెల 10వ తేదీన అన్ని కలెక్టరెట్ల వద్ద ఆందోళనలు చేస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా సాధిస్తామని బిజెపి, టిడిపిలు తమ మేనిఫెస్టోలో చెప్పాయన్నారు. హోదా సాధనకు నిరంతరం పోరాడుతామని చెప్పారు. ఆందోళనలు, ధర్నాల వల్ల ఫలితం ఉంటుందని చెప్పారు.
ఏపీ సీఎం చంద్రబాబు రెండేళ్లుగా అదే చెబుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పినప్పుడు అన్ని పార్టీలు, ఏపీ ప్రజలు గగ్గోలు పెట్టారని, తెలుగుదేశం పార్టీ మాత్రం ఎందుకు మిన్నకుండిందని ప్రశ్నించారు. ఎందుకంటే బీజేపీతో దానికి లాలూచీ ఉందన్నారు.
నిన్న మురళీ మోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్లు మాట్లాడుతూ.. ఇంకా టైం ఉంది, ఇస్తారని కేంద్రానికి వత్తాసు పలికారని విమర్శించారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదా ముఖ్యమా లేక వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమా అని ప్రశ్నించారు.
చంద్రబాబుకు ప్రాంతీయ అవసరాలు, అభివృద్ధి పట్టదా అని నిలదీశారు. కేసుల నుంచి బయటపడేందుకే చంద్రబాబు ప్రత్యేక హోదా పైన నోరు మెదపడం లేదన్నారు. కేంద్రం దిగి వచ్చే వరకు ఉద్యమిస్తామన్నారు. ఏపీకి ఆర్థిక ప్యాకేజీ ఇస్తే సరిపోతుందని చెప్పడం దురదృష్టకరమన్నారు.
బిజెపిపై బోండా ఉమ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా లేదంటూ పార్లమెంట్లో చేసిన ప్రకటన పట్ల టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విభజన సమయంలో పార్లమెంట్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ చేసిన వ్యాఖ్యలకు ఏపీ ప్రజలు పులకించిపోయారని, కానీ ఈ రోజు కేంద్రం చెబుతోన్న మాటలకు ఆందోళన చెందుతున్నారన్నారు.
రాష్ట్ర ప్రజలు ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఎన్డీఏ అండ తమకు పుష్కలంగా ఉంటుందని ఏపీ ప్రజలు నమ్మారన్నారు. ఏపీలో నేటి పరిణామాలు ఎలా ఉన్నాయో కేంద్రం గుర్తించాలన్నారు. ప్రధాని ఇచ్చిన హామీకే విలువ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు.
ఏపీకి పరిశ్రమలు లేవు, రెవెన్యూ లోటు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకయ్య నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత తీసుకోవాలన్నారు. కేంద్రం 5 కోట్ల మంది ఏపీ ప్రజలకి నష్టాన్ని చేకూరుస్తోందన్నారు. ప్రత్యేక హోదాపై ప్రధాని స్పందించాలని డిమాండ్ చేశారు. ఏపీ లోటు బడ్డెట్లో ఉందని, హోదాపై వెనకడుగు వేయొద్దన్నారు.