మంత్రి బొత్స కుటుంబానికి కరోనా పరీక్షలు: రిపోర్టులో ఏమొచ్చిందంటే..?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో లాక్డౌన్ మరింత కఠినంగా అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. కరోనా కేసులు పెరుగుతుండటం మరింత ఎక్కువ మందికి పరీక్షలు చేసేందుకు సిద్ధమైంది.
మంత్రి బొత్స కుటుంబానికి కరోనా పరీక్షలు..
తాజాగా, రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీకి సోమవారం విజయనగరంలోని వారి నివాసంలో వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా, ఈ ముగ్గురికీ కూడా కరోనా నెగెటివ్ వచ్చిందని తెలిపారు వైద్యులు.
సమష్టి కృషితోనే..
ఫలితాలు త్వరగా రాబట్టేందుకు కరోనావైరస్ నిర్ధారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఏపీలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కరోనా రహిత జిల్లాలుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఇటీవల నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణపై విజయనగరంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశమైంది. జిల్లాలో కరోనాను అడ్డుకునేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
కరోనా రహిత జిల్లాగా విజయనగరం..
ఇదే వ్యూహాన్ని కొనసాగించి విజయనగరం జిల్లాను కరోనా రహిత జిల్లాగా నిలపాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులు, ప్రజలకు పిలుపునిచ్చారు.డయాలసిస్, క్యాన్సర్ రోగులు ఆస్పత్రులకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నిత్యావసరాలు, కూరగాయాలు అమ్మేవారికి సహకరించాలని సూచించారు.
Recommended Video
ఏపీలో భారీగా పెరిగిన కేసులు
కాగా, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1259 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 258 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 970 మంది కరోనా రోగులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 31 కరోనా మరణాలు సంభవించాయి. కరోనా నియంత్రణలో సర్కారు నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.