అమ్మా పెట్టదు, అడుక్కు తిననివ్వదు: బొత్స, వైసీపీపై బాబు ఆగ్రహం
అమరావతి: బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ శుక్రవారం అన్నారు. కేవలం వట్టి మాటలతో ఇన్నాళ్లు చంద్రబాబు ప్రభుత్వం కాలాయాపన చేసిందని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించకపోవడంపై టీడీపీ మొసలి కన్నీరు కారుస్తోందన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో కూడా ఇలాగే చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వల్ల బడ్జెట్లో ఏమాత్రం లాభం కలగలేదన్నారు. చంద్రబాబు స్వార్థపూరిత ఆలోచనల వల్ల, అవినీతి వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందన్నారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం పాటుపడుతున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి బయటకు రావాలని, టీడీపీ కేంద్రమంత్రులు రాజీనామా చేయాలన్నారు.
ఢిల్లీలో చక్రం: బీజేపీకి చంద్రబాబు ఊహించని షాకిస్తారా?
కేంద్రం ఏం చేస్తోన్నా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. టీడీపీ కేసుల భయంతో ఉందని ఆరోపించారు. రాష్ట్రానికి నష్టం జరుగుతోందని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం తమ పార్టీ ఉద్యమాలు చేస్తుంటే వాటిని అణగదొక్కేందుకు చూశారన్నారు. అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదన్నట్లుగా టీడీపీ తీరు ఉందన్నారు.
వైసీపీ నేతల తీరుపై చంద్రబాబు టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీల కోసం వైసీపీ ఏనాడైనా కేంద్రాన్ని ప్రశ్నించిందా అన్నారు. రాజీనామా చేస్తానని గతంలో చెప్పారని, మరి ఎందుకు చేయలేదన్నారు. మనలను రాజీనామా చేయమని అడగడం విడ్డూరమన్నారు. మన ప్రజల న్యాయమే మనకు ముఖ్యమని చెప్పారు.