‘మోడీ ఏమైనా చెవిలో చెప్పారా? చంద్రబాబు పారిపోయి..! బాలకృష్ణ వియ్యంకుడికి భూములు’
అమరావతి: అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ విధానమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రణాళిక బద్ధంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు. ఆదివారం రాజధానుల అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీ రిపోర్టులపై హై పవర్ కమిటీ ఇచ్చే నివేదికను సమన్వయం చేస్తామని తెలిపారు. నిపుణుల కమిటీ నివేదికపై ప్రభుత్వం హైపవర్ కమిటీ వేసిందని తెలిపారు. హై పవర్ కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్లో చర్చిస్తామని మంత్రి తెలిపారు.
బాబు విచ్చలవిడిగా ఖర్చు చేశారు..
అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అన్నారు. మూడు రాజధానులపై ప్రకటన రాకముందే ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలుసుకోకుండా గత ప్రభుత్వం నడిపిన చంద్రబాబునాయుడు విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు బొత్స సత్యనారాయణ.
హైదరాబాద్ను తలదన్నేలా విశాఖ..
వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చంద్రబాబుకు లేదా? అని బొత్స ప్రశ్నించారు. ఇప్పుడున్న 13 జిల్లాల్లో విశాఖపట్నం రాజధానికి అనుకూలమైనదని అన్నారు. విశాఖపట్నం రాజధాని అయితే హైదరాబాద్ను తలదన్నేలా తయారవుతుందని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.
మోడీ ఏమైనా చెవిలో చెప్పారా?
బీజేపీలో చేరిన టీడీపీ నేతలు చంద్రబాబు మాటలే మాట్లాడుతున్నారని బొత్స విమర్శించారు. రాజధాని ఇంచు కూడా కదలదని.. బీజేపీలో చేరిన టీడీపీ నేత అంటున్నారని సుజనా చౌదరిని ఉద్దేశించి బొత్స వ్యాఖ్యానించారు. అతని మాటేమైనా శాసనమా? మోడీ ఏమైనా ఆ విషయం ఆయన చెవిలో చెప్పారా? అని బొత్స విమర్శించారు.
హైదరాబాద్ బాబు పారిపోయినప్పుడు..
తనపై అశోక్ గజపతిరాజు వ్యక్తిగత విమర్శలు దిగుతున్నారని బొత్స మండిపడ్డారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలా? వద్దా? అని బొత్స సత్యనారాయణ.. అశోక్ గజపతిరాజును ప్రశ్నించారు. కేంద్రమంత్రిగా ఈ ప్రాంతానికి ఏం చేశావని ప్రశ్నించారు.
ఇక మాజీ సీఎం తమకు ఎవరిచ్చారు అధికారమంటూ ప్రశ్నిస్తున్నారని.. అప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి పారిపోయి రావడానికి ఎవరిచ్చారో.. వారే అంటే ప్రజలే తమకు కూడా అధికారం ఇచ్చారని అన్నారు.
అప్పుల్లో ముంచిన చంద్రబాబు
మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను లక్ష కోట్ల అప్పుల్లో ముంచారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. లక్ష కోట్ల అప్పు చేసి రాజధాని కోసం రూ. 5వేల కోట్లే ఖర్చు చేశారని.. అందులో కేంద్రం రూ. 1500 కోట్లు ఇచ్చిందని తెలిపారు. ఈ ప్రాంతానికి చంద్రబాబు వల్ల ఏదైనా మేలు జరిగిందా? అని ప్రశ్నించారు.
బాలకృష్ణ వియ్యంకుడికి..
విశాఖపట్నంలో వైసీపీ నేతలపై టీడీపీ చేస్తున్న ఇన్ సైడ్ ట్రేడింగ్ ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు, ఆయన బంధువులు భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. బాలకృష్ణ వియ్యంకుడికి, ఆయన కుమారుడికి భూములు కేటాయించారని అన్నారు. దాదాపు 490 ఎకరాల భూములను కేటాయించి రెండు నెలల తర్వాత సీఆర్డీఏలో కలిపారని ఆరోపించారు. ఇదంతా ప్రజా దోపిడీ కాదా? అని బొత్స ప్రశ్నించారు. సిట్ విచారణ చేపడితే టీడీపీ నేతల బాగోతాలు బయటపడతాయని అన్నారు.