అజ్ఞాతవాసులు! జగన్ను అవహేళన చేస్తారా?: బాబు, పవన్పై బొత్స తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతా కలిసి పోరాటం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Recommended Video
పవన్! ఎలా నమ్మాలి? బాబుపై అలా.. జగన్పై ఇలా: నాశనం చేస్తున్నారని ఏకేసిన అంబటి
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని బొత్స సత్యనారాయణ అన్నారు. విభజన అంశాల్లో ఏ ఒక్కటీ లేదని అన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ వైసీపీ పోరాటం చేస్తుందని చెప్పారు.
బాబు, పవన్ అజ్ఞాతవాసులే..
పవన్ కళ్యాణ్ ఓ అజ్ఞాతవాసి అని.. అప్పుడప్పుడూ బయటికి వచ్చి మాట్లాడతారని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబునాయుడు అవసరమైనప్పుడు మాట్లాడరని విమర్శించారు. రాజీనామాలు కాదు, అవిశ్వాసం పెట్టండి అని పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారని.. ఈ సవాల్ను స్వీకరించిన వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్లమెంటులో అవిశ్వాసం పెట్టేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. అయితే, మళ్లీ పవన్.. జగన్ సవాల్ను స్వీకరిస్తున్నానని చెప్పడం ఏంటని ప్రశ్నించారు.
ఆఖరి అస్త్రం ఎప్పుడు బాబూ..
ఇక చంద్రబాబు అయితే.. అవిశ్వాసం అనేది ఆఖరి అస్త్రం అని అంటున్నారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందకున్నా.. ఇంకా ఆఖరి అస్త్రం అంటూ చంద్రబాబు అనడం ఏంటని, ఆ అస్త్రాన్ని ఇంకా ఎప్పుడు ఉపయోగిస్తారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డిని అవహేళన చేస్తారా?
అంతేగాక, జగన్మోహన్ రెడ్డికి సభా సాంప్రదాయాలు తెలియవని అవహేళన చేస్తున్నారని చంద్రబాబుపై బొత్స మండిపడ్డారు. తమకు సభా సాంప్రదాయాలు తెలుసునని స్పష్టం చేశారు. నాలుగేళ్లు కేంద్రం సాయం చేస్తోందని చెప్పి.. ఇప్పుడు అన్యాయం జరిగిందని చంద్రబాబు అనడం ఎంతవరకు సమంజసమని అన్నారు.
బాబు స్వార్థం కోసమే..
స్వార్థం, దోపిడీ కోసమే నాలుగేళ్లుగా కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి చేయలేదని బొత్స ఆరోపించారు. హోదా కోసం జగన్ అవిశ్వాస తీర్మానం పెడితే.. మితపక్షమైన టీడీపీ మద్దతు తెలిపేలా పవన్ చూడాలని అన్నారు. ఎందుకంటే.. ఎన్నికల సమయంలో టీడీపీకి, బీజేపీకి ఓటేయాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు.
అప్పుడు చొక్కా పట్టుకుంటానని..
అధికారంలోకి వచ్చాక హామీలు నెరవేర్చకపోతే చొక్కాలు పట్టుకుని అడుగుతామన్నారని.. నాలుగేళ్లలో ఒకసారైనా అడిగారా? అని బొత్స ప్రశ్నించారు.
చంద్రబాబును ప్రశ్నించాల్సిన బాధ్యత పవన్ కు లేదా? అని నిలదీశారు. హోదా కోసం వైసీపీ ఆందోళనలు చేస్తుంటే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం అట్టుడికిపోతున్నా.. చంద్రబాబు, పవన్ బయటికి రారని అన్నారు. మిత్రపక్షాలుగా పవన్, చంద్రబాబు ఒకరికొకరు సహకరించుకుంటున్నారని అన్నారు.
పక్కదో పట్టిస్తున్నారు..
అవిశ్వాసంపై వైసీపీ కృతనిశ్చయంతో ఉందని బొత్స స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు మద్దతు తెలిపేలా పవన్ ఒత్తిడి చేయాలన్నారు. తమ పార్టీ కేంద్రంపై పార్లమెంటులో ఒత్తిడి తీసుకొస్తుందని, అవిశ్వాస తీర్మానం పెట్టడంలో వెనుకాడమని స్పష్టం చేశారు. తమకు హోదానే ముఖ్యమని బొత్స అన్నారు. ఆవేదన, బాధతో మాట్లాడాల్సి వస్తోందని తెలిపారు. పవన్.. పోలవరంపై, కేంద్రం నిధులపై శ్వేతపత్రం విడుదల చేయమన్నారని, ఆ తర్వాత ఏం జరిగిందని ప్రశ్నించారు. టీడీపీ-జనసేన చేస్తున్న పనులు పక్కదోవ పట్టించేలా ఉన్నాయని బొత్స అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నా.. పవన్ పట్టించుకోలేదని అన్నారు.
హోదా కోసం వైసీపీ పోరాటం ఆగదు
హోదా రాజకీయ సమస్య కాదని, ప్రజల ప్రయోనానికి సంబంధించిన సమస్య అని బొత్స అన్నారు. విభజన చట్టంలో పెట్టిన హామీలను కేంద్రం అమలు చేయాల్సిందేనని అన్నారు. ఆఖరి అస్త్రం అంటూ చంద్రబాబు ఎన్నాళ్లు నాన్చుతారని బొత్స ప్రశ్నించారు. హోదా కోసం అవిశ్వాసం పెడతామని, పోరాటం చేస్తామని.. ఐనా కేంద్రం స్పందించకుంటే తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని బొత్స స్పష్టం చేశారు.