ఎంపీల రాజీనామాలు, ఢిల్లీ కేంద్రంగా దీక్ష: మోడీ, బాబులను ఏకేసిన జగన్ పార్టీ, టీడీపీ, పరిటాల హత్యలే
హైదరాబాద్: రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, పార్థసారథి, మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారు ఆదివారం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీమానాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తమ పార్టీ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని అన్నారు. అంతేగాక, ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేద్దామని అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు.
ఎంపీల రాజీనామాలు
పార్లమెంటు సమావేశాల చివరి రోజున తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని అన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను ఎన్డీఏ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. రాజకీయ కోణంలో కాకుండా హోదా ఒక్కటే మాట మార్గం పోరాటం చేస్తున్న తమతో అన్ని పార్టీలు కలిసి రావాలన్నారు.
ఢిల్లీ కేంద్రంగా దీక్ష.. రాజీనామా చేయాలి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఢిల్లీ కేంద్రంగా తమ పార్టీ ఎంపీలు దీక్ష చేస్తారని, అందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని అన్నారు. జాతీయ ఉద్యమం తరహాలో పోరాటం చేయాలని చంద్రబాబు అన్నారని.. అయితే, ఆ తరహాలో తామే పోరాటం చేస్తున్నామని బొత్స చెప్పారు. జగన్ నిర్ణయం మేరకు తాము ఢిల్లీలో దీక్ష చేయనున్నామని చెప్పారు.
ఈ దేశం కాదా? ఏపీ ప్రజలకు హక్కులు లేవా?
ఏపీ దేశంలో అంతర్భాగం కాదా? అని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నేతలను బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తాము ఈ దేశ ప్రజలం కాదా? రాజ్యాంగ హక్కులు లేవా? అని నిలదీశారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుంటే ఎలా అని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తాము ఇలాంటి పరిస్థితి చూడలేదని అన్నారు.
చంద్రబాబుకు గుణపాఠం
నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు రిలే దీక్షలు చేస్తారని బొత్స చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పోరాటంలో అంతా కలిసి రావాలని కోరారు. హోదా కోసం పోరాటం చేసిన వారిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలని బొత్స డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్పిన బూటకపు హామీలను నమ్మి ప్రజలు ఓటేశారని, ఇక వచ్చే ఎన్నికల్లో ప్రజలు బాబుకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. హోదాపై మరోసారి మాట మార్చొద్దని చంద్రబాబుకు హితవు పలికారు.
బావా! బామ్మర్ది అంటూ.. : చిరు, వపన్, జేపీపై కత్తి మహేష్ తీవ్ర వ్యాఖ్యలు
జగన్ కార్యాచరణ.. బాబేమో ఇలా..
మరో నేత పార్థసారథి మాట్లాడుతూ.. జగన్ ప్రకటించిన కార్యాచరణతో రాష్ట్ర ప్రయోజనాలపై తమ పార్టీ చిత్తశుద్ధి, నిబద్ధత స్పష్టమవుతోందని అన్నారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి, అధికారమే పరమావధిగా చంద్రబాబు వ్యవహరించారని అన్నారు. ఎన్నికలు ఏడాది ఉందనగా.. ఇప్పుడు పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్నారని మండిపడ్డారు. అప్పుడేమో కేంద్రమంత్రులకు సన్మానాలు, అసెంబ్లీలో ప్రశంసలు చేసిన బాబు.. ఇప్పుడు ఆయనొక్కరే హోదా కోసం పోరాడుతున్నట్లు చెప్పుకుంటున్నారని.. దీన్ని చూసి ప్రజలు ఆయన్ను అసహ్యించుకుంటున్నారని అన్నారు.
పోటుగాడిలా.. చంద్రబాబు పోరాటం ఎక్కడ?
మోడీ, బీజేపీలతో స్నేహం చేసిన చంద్రబాబు హోదా కోసం ఎన్నడూ పోరాటం చేయలేదని అన్నారు. కాంట్రాక్టర్లను మార్చడం కోసం నాగపూర్, ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. పోలవరం నిధుల కోసం గానీ, హోదా కోసం గానీ చంద్రబాబు కేంద్రం వద్దకు వెళ్లలేదని పార్థసారథి ఆరోపించారు. 29సార్లు ఢిల్లీ వెళ్లామని చెప్పుకుంటున్న చంద్రబాబు.. అప్పుడు కేంద్రానికి ఇచ్చిన లేఖలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జనవరి 12న ఆఖరుసారి మోడీని చంద్రబాబు కలిశారని.. హోదా గురించి మాత్రం మాట్లాడలేదని, ఆర్థిక సాయం మాత్రమే అడిగారని చెప్పారు. అప్పుడు హోదా గురించి అడగని చంద్రబాబు.. ఇప్పుడు తానే పోటుగాడిగా పోరాటం చేస్తున్నట్లు.. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారని మండిపడ్డారు. ఆయనకెందుకు మద్దతివ్వాలని ప్రశ్నించారు.
బాబే ప్రథమ దోషి
రాష్ట్రానికి అన్యాయం జరిగిన విషయంలో చంద్రబాబే ప్రథమ దోషి అని పార్థసారథి అన్నారు. మోడీ పోరాటం కంటే బాబుపైనే రెట్టింపు పోరాటం చేయాల్సి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని అన్నారు. అవిశ్వాసం అంటే ఎందుకు అన్నారని, రాజీనామాలు అవసరం లేదన్నారని.. అన్నారు. గతంలో రాజీనామాలు చేసినవారు తమ డిమాండ్లు సాధించుకున్నారని చెప్పారు. హామీలను బీజేపీ, టీడీపీలు తుంగలో తొక్కాయన్నారు. ఓటు నోటు కేసులో భయపడి అమరావతికి వచ్చారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
టీడీపీ హత్యా రాజకీయాలు.. సోమిరెడ్డి చుట్టూ..
రాష్ట్రంలో టీడీపీనే హత్య రాజకీయాలకు పాల్పడుతోందని మరో వైసీపీ నేత మల్లాది ష్ణు ఆరోపించారు. జగన్ వైఖరి వీధి రౌడీలా ఉందంటారా? అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మలమడుగులో హత్య రాజీకయాలు చేసేవారంతా సోమిరెడ్డి చుట్టే ఉన్నారని అన్నారు. కాంట్రాక్టుల కోసం టీడీపీ నేతలు కొట్టుకున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మంత్రి పరిటాల సునీత వర్గీయులే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతను హత్య చేశారని మల్లాది విష్ణు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన హత్యలు ఎప్పుడూ జరగలేదని అన్నారు.
ఏకైక వ్యక్తి సోమిరెడ్డి
ఎన్నికల్లో ఐదుసార్లు ఓడిపోయిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డేనని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. వ్యవసాయం గురించి ఏ మాత్రం తెలియని సోమిరెడ్డికి ఆ శాఖ కేటాయించడం సరికాదన్నారు. అంతేగాక, జగన్మోహన్ రెడ్డిని తిట్టే పోర్టు ఫోలియోనే ఆయనకు కేటాయించినట్లుగా సోమిరెడ్డి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసే అర్హత మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డికి లేదని అన్నారు. ఏపీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ తిరస్కరిస్తారని అన్నారు.