భార్య కేంద్రంలో, భర్త రాష్ట్రంలో! లాలూచీ రాజకీయాలు ఎవరివి?: బాబుపై బొత్స ఫైర్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీపై ధ్వజమెత్తారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
'మ్యాటర్ వీక్.. పబ్లిసిటీ పీక్': బాబు, లోకేష్పై బుగ్గన నిప్పులు, బీజేపీ నేతల భేటీపై క్లారిటీ
2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బొత్స చెప్పారు. అంతేకగా, వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పారు.
తప్పుడు ప్రచారం
బీజేపీ అగ్ర నేతలతో తమ పార్టీ నేతలు భేటీ అయ్యారని తప్పుడు ప్రచారం చేస్తూ గందరగోళానికి గురిచేస్తున్నారని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా మండిపడ్డారు. బుగ్గన రాజేంద్రనాథ్ ఎవర్నో కలిశారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నాలుగేళ్లు టీడీపీ, బీజేపీలు ఏపీకి తీవ్ర నష్టం కలిగించాయని అన్నారు.
భార్య కేంద్రంలో.. భర్త రాష్ట్రంలో..
పిరికిపందల్లా అబద్ధాలు చెప్పడం తాము చేయలేమని బొత్స అన్నారు. పరకాల ప్రభాకర్ టీడీపీ ప్రభుత్వం సలహాదారుగా పనిచేస్తుంటే.. ఆయన సతీమణి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారని అన్నారు. అంతేగాక, మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత భార్యకు టీటీడీ సభ్యురాలిగా నియమించారని అన్నారు. ఈ విషయాలను గమనిస్తే బీజేపీతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తుందెవరు? అని బొత్స ప్రశ్నించారు.
బాబు అవినీతిపై పుస్తకం
ఎన్డీఏ నుంచి విడిపోయిన తర్వాత కూడా ప్రభాకర్ సంధానకర్తగా పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, దోపిడీపై తాము ఓ పుస్తకం తీసుకొస్తామని, దేశంలోని అన్ని పార్టీలకు ఆ పుస్తకాన్ని పంచుతామని బొత్స చెప్పారు. చంద్రబాబు అవినీతి చెప్పడానికి తమకు భయమెందుకు? అని అన్నారు.
దోపిడీ చేయడానికా?
చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసి, దేశంలోని అన్ని రాజకీయపార్టీల నేతలను కలిసి వివరిస్తామని బొత్స చెప్పారు. అధికారంలోకి వచ్చింది దోపిడీ చేయడానికి కాదని అన్నారు. బీజేపీ నేత రాంమాధవ్ను టీడీపీ నేతలు కలవడం నిజం కాదా? అని బొత్స ప్రశ్నించారు.
జగన్ యాత్ర అందుకే.. బాబుకు శిక్ష తప్పదు
బుగ్గన ఢిల్లీకి వెళితే చంద్రబాబుకు ఎందుకు భయమని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. బుగ్గున పేరు రాసి, తప్పుడు తేదీలు వేసి లాగ్ బుక్ను టాంపరింగ్ చేశారని ఆరోపించారు. అవినీతి, దోపిడీలకు పాల్పడుతున్న చంద్రబాబునాయుడుకు శిక్ష తప్పదని అన్నారు. రాష్ట్రాభివృద్ధి, శ్రేయస్సే తమ లక్ష్యమని అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే తమ నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారని అన్నారు.