15 శాతానికి మించకుండా ఆస్తి పన్నుపెంపు, బీజేపీ నేతల నీతులు అవసరం లేదు : మంత్రి బొత్సా ఫైర్
ఆస్తిపన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో ఆస్తి పన్ను పెంపుపై ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు. కేంద్రప్రభుత్వం సూచనల మేరకే ఆస్తిపన్ను విధానంలో మార్పులు చేశామని బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఆస్తి పన్ను పెంపు ఎట్టిపరిస్థితుల్లోనూ 15 శాతానికి మించకుండా చూస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా ఇంటి అద్దె పైన కూడా పారదర్శక విధానాన్ని తీసుకువస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. బీజేపీ నేతలు తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్న బొత్స సత్యనారాయణ తమ ప్రభుత్వానికి ఏ సమయంలో ఏం చేయాలో తెలుసని హితవు పలికారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా బిజెపి నేతలు ఆస్తి పన్ను పెంపుపై పలుచోట్ల నిరసనలు చేపట్టారు. అసలే కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్న బిజెపి నేతలు ఈ సమయంలో నూతన పన్నుల విధానాన్ని తీసుకురావడం ప్రజలపై మరింత భారం వెయ్యటమేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ చర్యను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.