ఎయిర్ఏషియా స్కాం-బాంబు పేల్చిన బొత్స: ఆ ఫోన్ల తర్వాతే మార్పు, సింగపూర్లో బాబు వారిని కలవలేదా?
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ఏషియా కుంభకోణం సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఆ కంపెనీ ప్రతినిధులు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావించడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో బొత్స తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
ఎయిర్ఏషియా ఎఫెక్ట్, గుర్తుపెట్టుకోండి.. ప్రకంపనలు సృష్టించే స్కాం బయటపెడ్తాం: కేంద్రంపై సంచలనం
ఎయిర్ ఏషియా స్కాంకు యూపీఏ హయాంలోనే పునాది పడిందని చెప్పారు. టీడీపీ నేత, ఎంపీ అశోక్ గజపతి రాజు విమానయాన మంత్రి అయిన తర్వాత ఎయిర్ ఏషియాకు అనుకూలంగా పరిణామాలు మారాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎయిర్ ఏషియాకు అనుకూలంగా నిబంధనలు సవరించారని చెప్పారు.
సింగపూర్ లాబీతో టీడీపీకి సంబంధాలు నిజమా, కాదా
సింగపూర్ లాబీకి రూ.12 కోట్లు ఇచ్చింది నిజమా, కాదా చెప్పాలని బొత్స సత్యనారాయణ నిలదీశారు. సింగపూర్ లాబీతో తెలుగుదేశం పార్టీకి సంబంధాలు ఉండటం నిజమా, కాదా చెప్పాలన్నారు. ఎయిర్ ఏషియా ప్రతినిధుల సంభాషణల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు ఉందని చెప్పారు. రాజేందర్ దుబేతో చంద్రబాబు పలుమార్లు భేటీ అయ్యారని చెప్పారు.
అశోక్ హయాంలో నిబంధనలు మార్పు
ఎన్నో అవినీతి కేసులలో చంద్రబాబు నాయుడు పేరు బాగా వినిపించిందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు దోచుకున్నారన్నారు. ఇప్పుడు దేశాన్ని కూడా వదలడం లేదని, దేశాన్ని దోచుకు తింటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యూపీఏ హయాంలోనే ఈ స్కాంకు పునాదీ పడినప్పటికీ అశోక్ వారికి అనుకూలంగా నిబంధనలు మార్చారన్నారు.
3 రోజులుగా ఎయిర్ ఏషియా స్కాంలో ఇద్దరి పేర్లు
గత మూడు రోజులుగా ఎయిర్ ఏషియా స్కాం అంశంలో అశోక్ గజపతి రాజు, చంద్రబాబు పేర్లు వినిపిస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు ఎన్నో కుంభకోణాల్లో ఉన్నా స్టే తెచ్చుకున్నారని చెప్పారు. స్టేలు తెచ్చుకొని ఆయన పబ్బం గడుపుతారన్నారు. అశోక్ గజపతి రాజు నిజాయితీపరుడిగా చెప్పుకుంటూ ఎయిర్ ఏషియా కుంభకోణంలో భాగస్వామి అయ్యారని మండిపడ్డారు.
ఆ ఫోన్ సంభాషణల తర్వాతే నిబంధనల మార్పు
ఎయిర్ ఏషియా స్కాంలో ఇండియా సీఈవో, ఇంటర్నేషనల్ సీఈవో ఫోన్ సంభాషణల తర్వాత నిబంధనలు మార్చారని బొత్స సత్యనారాయణ మరో బాంబు పేల్చారు. టీడీపీ పెద్దలకు ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నది వాస్తవం కాదా చెప్పాలని నిలదీసారు. సీబీఐ దర్యాఫ్తులో అన్నీ బయటకు వస్తున్నాయని చెప్పారు. ఏపీ పరువును చంద్రబాబు అంతర్జాతీయ స్థాయిలో తీశారని భగ్గుమన్నారు. చంద్రబాబు దీనిపై వెంటనే స్పందించాలన్నారు.
ఇవన్నీ వాస్తవమా, కాదా చెప్పండి
చంద్రబాబు తన సింగపూర్ పర్యటనలో స్కాంలు ఉన్నవారిని కలిసింది నిజమా కాదా చెప్పాలని బొత్స సత్యనారాయణ అన్నారు. సింగపూర్ లాబీకి రూ.12 కోట్లు ఇచ్చింది వాస్తవమా, కాదా చెప్పాలన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టులో వాటాలు కుదరక రద్దు చేసింది నిజమా, కాదా చెప్పాలని నిలదీశారు. విడిభాగాల కొనుగోలులో అశోక్ గజపతి రాజు ఓఎస్టీ అప్పారావు కొందరితో ఒప్పందం కుదిర్చింది వాస్తవం కాదా చెప్పాలన్నారు.
అప్పారావు లోకేష్ సన్నిహితుడా కాదా?
అప్పారావు లోకేష్ సన్నిహితుడా కాదా చెప్పాలన్నారు. ఎయిర్ ఏషియా కుంభకోణంలో మీ ప్రమేయం లేకుంటే మీకు భయం ఎందుకో చెప్పాలని బొత్స సత్యనారాయణ టీడీపీని ప్రశ్నించారు. ఈ అంశంలో సీబీఐ దర్యాఫ్తుకు డిమాండ్ చేసి చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. సీబీఐ దర్యాఫ్తులోనే అన్నీ తేలుతాయని బొత్స వ్యాఖ్యానించారు.