ఏప్రిల్లో వైజాగ్ వెళ్లిపోతున్నాం.. ఇప్పుడేం వద్దు..! విద్యాశాఖాధికారులకు బొత్స కీలక సంకేతం !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా అమరావతి నుంచి వైజాగ్ కు రాజధాని తరలింపు చేపట్టేందుకు ముహుర్తం సిద్ధమవుతోంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు మంత్రి బొత్స కీలక సంకేతం ఇచ్చారు.
అమరావతి : ఏపీలో వైసీపీ సర్కార్ చేపట్టిన మూడు రాజధానుల ప్రక్రియ మొదలై మూడేళ్లు దాటిపోయినా ఇంకా దీనిపై అంతిమ నిర్ణయం వెలువడలేదు. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో వైసీప సర్కార్ సవాల్ చేయడంతో దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రులు మాత్రం మరో రెండునెలల్లో రాజధాని తరలింపుకు సిద్ధమైపోతున్నారు. ఈ మేరకు తాజాగా పలు సంకేతాలు ఇస్తున్నారు.
ఏప్రిల్లో వైజాగ్ కు రాజధాని?
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిని అమరావతి నుంచి వైజాగ్ కు త్వరలో తరలించేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు ఈ మేరకు వరుసగా సంకేతాలు ఇచ్చేస్తున్నారు.
ఇప్పటికే పలువురు మంత్రులు వైజాగ్ కు మరో రెండునెలల్లో రాజధాని తరలిపోతుందని సంకేతాలు ఇవ్వగా.. ఇప్పుడు జగన్ సర్కార్ లో కీలక మంత్రి బొత్స సత్యనారాయణ అయితే ఏకంగా తన శాఖలో అధికారులకే ఈ సంకేతం ఇచ్చారు.
విద్యాశాఖ అధికారులతో బొత్స
రాజధాని వైజాగ్ తరలింపులో భాగంగా ప్రస్తుతం విజయవాడ, అమరావతిలో ఉన్న పలు ప్రభుత్వ కార్యాలయాల్ని అక్కడికి తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని ఎప్పటి నుంచో ప్రభుత్వం అధికారులకు సంకేతాలు ఇస్తూనే ఉంది.
అయితే తాజాగా ఇదే కోవలో వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇలాంటిదే మరో సంకేతం ఇచ్చారు. అధికారులకు తాజాగా బొత్స ఇచ్చిన సంకేతం ఇప్పుడు రాజధాని తరలింపు ఖాయమైందా అన్న అనుమానాల్ని తెరపైకి తెస్తోంది.
ఏప్రిల్లో వెళ్లిపోతున్నాంగా.. !
విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలో ఉన్న విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయాన్ని విజయవాడ నగరంలోకి మార్చేందుకు మంత్రి బొత్సకు అధికారులు తాజాగా ప్రతిపాదన ఇచ్చారు. రాజధాని తరలింపుపై గందరగోళం కొనసాగుతున్న నేపథ్యంలో కమిషనరేట్ ను విజయవాడకు మార్చుకుందామని ప్రతిపాదించారు.
దీంతో బొత్స ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. అంతే కాదు కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్లు తెలిసింది. ఏప్రిల్లోనే వైజాగ్ కు వెళ్లిపోతున్నాం కదా... ఇప్పుడు ఈ తరలింపు ఎందుకని వారించినట్లు సమాచారం. దీంతో విద్యాశాఖ అధికారులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
జగన్ సర్కార్ ధీమా వెనుక?
అయితే రాజధాని తరలింపుపై వైసీపీ సర్కార్ లో మంత్రులు వరుసగా చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే కచ్చితంగా ఏప్రిల్లో తరలింపు ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే వీరి ప్రకటనల వెనుక ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఒకటి సుప్రీంకోర్టులో ప్రస్తుతం రాజధానులపై సాగుతున్న విచారణ త్వరలోనే పూర్తయి తుది తీర్పు వెలువడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుండం.
మరో అంశం విశాఖకు రాజధాని తరలింపుపై వైసీపీ సర్కార్ మాటలకే పరిమితం అవుతోందన్న విమర్శలతో అక్కడి మంత్రులపై పెరుగుతున్న ఒత్తిడి కూడా ఉందని తెలుస్తోంది. దీంతో జగన్ సర్కార్ లో మంత్రులు ఇలాంటి సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. లేకపోతే న్యాయప్రక్రియలో ఉన్న రాజధాని తరలింపుపై ఇలాంటి ప్రకటలు రావని అంటున్నారు.