కర్నూలులో జగన్ జలదీక్ష: తేదీ ఖరారు, కేసీఆర్ వ్యూహంలో భాగమేనా?
విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులతో రాయలసీమ ఎడారిగా మారుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. శుక్రవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని మండిపడ్డారు.
వ్యవసాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని చెప్పిన బొత్స, తెలంగాణ సర్కారు ఆనకట్టలు కట్టుకుంటూ పోతే, రాయలసీమతో పాటు కృష్ణా, గోదావరి డెల్టాలు ఎడారిగా మారే ప్రమాదముందన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొవడం వల్లనే ప్రాజెక్టులపై స్పందించడం లేదన్నారు.
అంతేకాకుండా ఈ కేసులో చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్తో లాలూచీ పడటం వల్లే ఈ ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా బాధ్యత గల ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ జలదీక్షను చేస్తున్నామని చెప్పారు.
ఎగువ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులను ఆపి మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలనే ఉద్దేశంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలులో మే 16,17, 18 తేదీల్లో జలదీక్ష చేస్తారని చెప్పారు. ఈ దీక్ష ద్వారా రాష్ట్రానికి జరగుతున్న నష్టాలు, వ్యవసాయానికి వచ్చే ఇబ్బందులు తెలియజేస్తామన్నారు.
తాజాగా టీడీపీ నేతలు కొందరు వైసీపీ ద్వంద వైఖరి అవలంభిస్తోందని అంటున్నారని, అయితే రాష్ట్రంలో అధికారంలో ఉంది వైసీపీ ప్రభుత్వమా లేక టీడీపీ ప్రభుత్వమా? అని బొత్స నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడమంటే మీ స్వార్ధపూరిత రాజకీయాల కోసం తెలంగాణ ప్రాజెక్టులు కడుతుంటే నిమ్మకుండిపోయింది మీరు కాదా? అని నిలదీశారు.
జగన్ చేపట్టిన జలదీక్షకు మద్దతుగా 17న ఏపీలోని అన్ని మండల కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు బొత్స వివరించారు. పనామా పత్రాల్లో హెరిటేజ్ డైరెక్టర్ పేరు ఉందని ఈ సందర్భంగా బొత్స గుర్తు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు, హెరిటేజ్ యాజమాన్యంపై ఉందన్నారు.
జగన్ జలదీక్ష కేసీఆర్ వ్యూహంలో భాగమే: రేవంత్ రెడ్డి
వైసీపీ అధినేత వైయస్ జగన్ తలపెట్టిన జలదీక్షలపై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణలోని ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత జగన్ చేపడుతున్న దీక్షలన్నీ కేసీఆర్ వ్యూహంలో భాగమేనని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.
ఒకవైపు ప్రాజెక్టు కాంట్రాక్టులను తన వారికి ఇప్పించుకుంటూ, మరోవైపు వాటిని అక్రమ ప్రాజెక్టులని చెప్పి ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులు అక్రమమని భావిస్తే, వెంటనే కాంట్రాక్టులు వదులుకోవాలని డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీని నిందిస్తూ, రెండువైపులా లాభపడాలన్నది కేసీఆర్, జగన్ల అభిమతంగా కనిపిస్తోందని రేవంత్ దుయ్యబట్టారు. ఏపీలోని తెలుగుదేశం నేతలు వారి ప్రాంత ప్రయోజనాలకు, తెలంగాణలోని నేతలు తెలంగాణ ప్రయోజనాలకు పాటుపడతారని తెలిపారు.