మూటలు మోసినవారి కోసమే పట్టిసీమ: బొత్స
విశాఖపట్నం : పట్టిసీమతో ఎవరికీ ప్రయోజనం లేదని కాంగ్రెస్ నేతలు బొత్స సత్యనారాయణ, వట్టి వసంతకుమార్లు అన్నారు. విశాఖలో వారు శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. టీడీపీ సర్కారు పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేందుకే పట్టిసీమ నిర్మిస్తుందని వారు ఆరోపించారు. పట్టిసీమతో పోలవరంకు ముప్పు ఏర్పడుతుందన్నారు.
పట్టిసీమకు పెట్టే డబ్బులు పోలవరానికి ఖర్చు చేయాలని వారు డిమాండ్ చేశారు. పట్టిసీమ వల్ల గోదావరి డెల్టా ప్రజలకు కలిగే ఇబ్బందులపై ఈ నెల 8వ తేదీన విశాఖలో రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ఎన్నికల్లో మూటలు మోసినవారి ప్రయోజనం కోసమే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని తలపెట్టారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
ఎన్నికల హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. మార్చి 31వ తేదీన టిడిపి ప్రజావంచన దినం నిర్వహిస్తామని చెప్పారు. అన్ని డివిజన్ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
పట్టిసీమ వల్ల పోలవరం ప్రాజెక్టు మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చినప్పటడి నుంచి రైతుల్లో ఆందోళన చోటు చేసుకుందని ఆయన అన్నారు. పోలవరం ఎడమగట్టు కాలువ కోసం ప్రభుత్వం మాట్లాడకపోవడడం విషాదకరమని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెసు అధిష్టానం ప్రస్తావించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం చలనం వచ్చిందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు టి. సుబ్బిరామి రెడ్డి అన్నారు. తన కృషితోనే విశాఖపట్టణం నగరంలోని కేజీహెచ్కు నిధులు మంజూరయ్యాయని అన్నారు. విభజన హామీలన్నీ అమలు చేయాలని, దీనికోసం రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ పోరాడాలని ఎంపీ సుబ్బరామిరెడ్డి కోరారు. హిందూస్తాన్ షిప్యార్డును కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన అన్నారు.