చంద్రబాబు జీవితమంతా అంతే, జగన్పై విమర్శలా: బొత్స ఫైర్
విశాఖపట్నం: కాపు రిజర్వేషన్లు, నిరుద్యోగ భృతి, ఓట్ల తొలగింపు అంశాలపై తెలుగుదేశం ప్రభుత్వం మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ గురువారం నిప్పులు చెరిగారు. చంద్రబాబు జీవితమే యూటర్న్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసమే ముఖ్యమంత్రి కుట్రలు చేస్తున్నారన్నారు.
పవన్ అడ్డదారిలో వెళ్తూ, జగన్ తోకముడిచాడు, నన్ను పలకరించకున్నా: బాబు ఆవేదన
లక్షలాది ఓటర్లను అక్రమంగా తొలగించారన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఓట్ల తొలగింపుకు వాడుకున్నారన్నారు. రాష్ట్రంలో 16 లక్షల ఓట్లను తొలగించారన్నారు. ఓట్ల తొలగింపుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. టీడీపీ అక్రమాలపై వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. ఏపీలో రాజ్యాంగానికి విఘాతం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును కాలరాస్తున్నారన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చింది వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. వైయస్ హయాంలోనే హంద్రీనీవా 80 సాతం పూర్తయిందన్నారు. గాలేరు నగరిని పూర్తి చేసింది ఎవరని ప్రశ్నించారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ, పురుషోత్తమపట్నం పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు.
కాపు రిజర్వేషన్లపై యూటర్న్ తీసుకున్నది మీరు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. అలాంటి మీరు తమ పార్టీ అధినేత జగన్పై విమర్శలు చేస్తారా అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా యూటర్న్లే అన్నారు. ఉద్యమ నాయకులపై కేసులు పెట్టించారన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
నిరుద్యోగ భృతి ఇస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. నిరుద్యోగులను మళ్లీ మోసం చేయవద్దన్నారు. రూ.2వేలు ఇస్తామని గత ఎన్నికల్లో చెప్పి, ఈ రోజు రూ.1000 అంటున్నారని మండిపడ్డారు.