జగన్పై దాడి జరిగితే ఇలానా? చంద్రబాబులో క్రూరత్వం బయటపడింది: బొత్స ఫైర్
హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు హాస్యాస్పదంగా ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు దాడిని ఖండించకుండా, డ్రామాలంటూ వ్యాఖ్యానిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవరీ శ్రీనివాస్?: జగన్ అభిమానా? టీడీపీ అనుచరుడా? ఈ ఫొటోల సంగతేంటి?
చంద్రబాబులోని క్రూరత్వం బయటపడింది..
ఇలాంటి ఘటన ఏదైనా జరిగితే మానవత్వం ఉన్నవారెవరైనా.. స్పందిస్తారు.. కానీ, సీఎంగా ఉన్న చంద్రబాబు మాత్రం అదొక డ్రామా అంటూ మాట్లాడటం ఆయనలోని క్రూరత్వాన్ని బయటపెడుతోందని బొత్స అన్నారు.
రాజకీయ ఉన్మాదిలా..
చంద్రబాబు ఒక రాజకీయ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని, ఆయన ముఖంలో క్రూరత్వమే కనిపిస్తోందని బొత్స దుయ్యబట్టారు. దాడిలో గాయపడిన వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయ పార్టీల నాయకులు పరామర్శించడం తప్పు అనే విధంగా బాబు మాట్లాడటం ఎంత వరకు సమంజసమని బొత్స ప్రశ్నించారు.
బాబుది నోరా.. తాటిమట్టా..?
చంద్రబాబుది నోరా.. తాటిమట్టా అంటూ ధ్వజమెత్తారు. ఆయన చిన్న మెదడు చితికినట్లు ఉందంటూ బొత్స ఎద్దేవా చేశారు. ఎవరైనా గాయమైతే ఆస్పత్రికి వెళ్తారా? పోలీస్ స్టేషన్కు వెళ్తారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు..
పట్టుబడిన నిందితుడి వద్ద 11పేజీల లేఖ ఎలా వచ్చిందో చెప్పాలంటూ బొత్స నిలదీశారు. చంద్రబాబు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, ఇందుకు ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలే నిదర్శనమని అన్నారు. ఏపీలో ఒక ఎమ్మెల్యే హత్యకు గురైనప్పుడే మీ పాలన ఎలా ఉందో అందరికీ తెలిసిందన్నారు. ఏపీలో శాంతిభద్రతలు అనేవి లేవని అన్నారు. కాగా, గురువారం మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి.. జగన్మోహన్ రెడ్డిపై కోడిపందేలకు వాడే కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.