బొత్స ప్రకటన కలకలం: కాంగ్రెస్ను వీడేది వీరేనా?
హైదరాబాద్: తమ పార్టీ నుంచి 25 శాసనసభ్యులు, ముగ్గురు మంత్రులు వెళ్లిపోతారని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపుతోంది. ఎవరెవరు పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నారనే విషయంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మీడియా కూడా పరిణామాలను బట్టి ఎవరెవరు కాంగ్రెసుకు రాజీనామా చేసే అవకాశాలున్నాయనే విషయంపై కథనాలను ప్రచురిస్తోంది.
ముగ్గురు మంత్రుల్లో గంటా శ్రీనివాస రావు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైనట్లు ఇప్పిటికే బలమైన వార్తలు వచ్చాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న ఏరాసు ప్రతాప రెడ్డి కూడా గోడ దూకే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. మరో మంత్రిపై కూడా అంచనాలు సాగుతున్నాయి.
ఇక శాసనసభ్యుల విషయానికి వస్తే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లే. తాజాగా, ఆయన అనుచురుడైన శ్రీకాకుళం డిసిసి అధ్యక్షుడు నరేంద్రపై పిసిసి వేటు వేసింది. అనంతపురం, కడప జిల్లాల కాంగ్రెసు కమిటీల అధ్యక్షుల రాజీనామాలను కూడా ఆమోదించింది. దర్మాన ప్రసాదరావుతో పలాస శాసనసభ్యుడు జె. జగన్నాయకులు కూడా కాంగ్రెసు పార్టీని వీడుతారనే ప్రచారం సాగుతోంది.
విజయనగరం జిల్లాలో సాలూరు శాసనసభ్యుడు పి. రాజన్నదొర ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఈ జిల్లాలో మరో శాసనసభ్యుడు కూడా పార్టీని వీడవచ్చుననే ప్రచారం సాగుతోంది. విశాఖపట్నం జిల్లాలో గంటా శ్రీనివాస రావుతో పాటు మరో నలుగురు శానససభ్యులు కాంగ్రెసు పార్టీని వీడుతారని ప్రచారం సాగుతోంది.
తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు శాసనసభ్యులు పార్టీని వీడుతారని అంటున్నారు. నెల్లూరు జిల్లాలోని ఇద్దరు కాంగ్రెసు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలోని ఒక శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీతో చర్చలు జరుపుతున్నారు.
కాగా, అనంతపురం జిల్లాలో తాడిపత్రి శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి పార్టీని వీడడం ఖాయమైంది. అయితే, వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని పోటీకి దింపే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెసు పార్టీని వీడే అవకాశాలున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఇద్దరు శాసనసభ్యులు కాంగ్రెసు పార్టీని వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. తమ పార్టీ నుంచి వెళ్లిపోయే తాజా ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారిని ఎంపిక చేస్తామని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం చెప్పారు.