నాలుగేళ్లలో బాబు-లోకేష్ సంపాదన రూ.3 లక్షల కోట్లు: విజయసాయి, కడపలో దొంగ దీక్ష: బొత్స
కడప/అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రద్ధ అంతా అవినీతి పైనే అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం ఆరోపించారు. భోగాపురం టెండర్లు ఖరారైన తర్వాత రద్దు చేయించారన్నారు. ఉత్తరాంధ్ర కుంటుపడేలా చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. నాలుగేళ్లలో తండ్రీ, కొడుకులు (చంద్రబాబు, లోకేష్) రూ.3 లక్షల కోట్లకు పైగా దోచుకున్నారని ఆరోపించారు.
చంద్రబాబు నాయుడును ఇంటికి పంపించేందుకు ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. పొత్తు విషయంలో జగన్దే తుది నిర్ణయమని చెప్పారు. ప్రత్యేక హోదాకు సహకరించే పార్టీలకు వైసీపీ మద్దతు ఉంటుందని చెప్పారు. ఎంపీ పదవులకు రాజీనామా చేసిన తమ పార్టీ ఎంపీలు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. నాలుగేళ్లయినా వంశధార ఫేజ్ 2 ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. ఉప ఎన్నికలు వచ్చే అవకాశముందని చెప్పారు.
25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు.. బొత్స
బీజేపీ, టీడీపీలు ఏపీని 25 ఏళ్లు వెనక్కి తీసుకు వెళ్లాయని బొత్స సత్యనారాయణ వేరుగా మండిపడ్డారు. నీతి ఆయోగ్ సమావేశం జరిగి 9 రోజులు అయినా రాష్ట్రానికి ఏమీ తీసుకు రాలేదన్నారు. నీతి ఆయోగ్ భేటీ తర్వాత మోడీని గానీ, బీజేపీ నేతలను గాను మంత్రులు ఒక్క మాట అనడం లేదని పాయింట్ లాగారు. టీడీపీ, బీజేపీలు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. టీడీపీ, బీజేపీ మధ్య ఉన్న ఒప్పందం బయట పెట్టాలన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో నాలుగేళ్ల పాటు మౌనంగా ఉండి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
లోకసభ, రాజ్యసభలలో పోరాటం చేయకుండా కడపలో దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ఏదో జరుగుతుందని చెప్పారని ఎద్దేవా చేశారు. బీజేపీతో చంద్రబాబు చీకటి ఒప్పందాలు పెట్టుకున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదన్నారు. ఢిల్లీలో గట్టిగా ఎందుకు పోరాడటం లేదన్నారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు.