గుట్టు విప్పిన అఖిలప్రియ -గ్యాంగ్ సినిమా చూపించి -3రోజులు, 30గం, 300ప్రశ్నలు -మళ్లీ కోర్టుకు
తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ మీడియాలోనూ చర్చనీయాంశమైన సంచలన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియను కస్టడీకి తీసుకున్న పోలీసులు మూడు రోజులపాటు విచారించారు. ఈ క్రమంలో అఖిలప్రియ సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని... రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
షాకింగ్: పిల్లి కళేబరాన్ని తొవ్వి తీసి -కూరలా వండుకుని తిన్న సెలబ్రిటీ -పెను దుమారం
అఖిలప్రియకు 300 ప్రశ్నలు
బోయిన్పల్లి(సికింద్రాబాద్)లో ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో ఏ1గా అరెస్టయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మూడు రోజుల పోలీసు కస్టడీ బుధవారంతో ముగిసింది. ఆమె నుంచి పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తొలుత దాటవేత ధోరణిని అవలంబించిన అఖిలప్రియ... ఆ తర్వాత కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్టు సమాచారం. సాంకేతిక ఆధారాలను కూడా ముందుంచడంతో... కొన్నింటిని ఆమె ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం అఖిలప్రియను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అఖిలప్రియను నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, ఇద్దరు ఏసీపీల బృందం ప్రశ్నించింది. ఆమెను దాదాపు 300 ప్రశ్నలు అడిగినట్టు సమాచారం.
ఎంజీఎం స్కూల్లో స్కెచ్ వేశారు..
అఖిల ప్రియ చెప్పిన సమాచారంతో పలు ఆధారాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె చెప్పిన వివరాల మేరకు ఎంజీఎం స్కూల్, కూకట్పల్లి హోటల్లో పలు ఆధారాలను పోలీసులు సీజ్ చేశారు. కిడ్నాప్కి సంబంధించిన వ్యవహారమంతా ఎంజీఎం స్కూల్లో జరిగినట్లుగా అఖిలప్రియ పోలీసుల ముందు వెల్లడించినట్లు తెలిసింది. తన భర్త భార్గవ్ రామ్ ఎంజీఎం స్కూల్ లో కిడ్నాపర్ల తో భేటీ అయినట్లుగా పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈ కిడ్నాప్కి సంబంధించి చంద్రహాస్, భార్గవ్ కూకట్పల్లిలోని హోటల్లో మాదల శీనుతో భేటీ అయినట్లుగా తెలిపింది.
సూర్యా ‘గ్యాంగ్' సినిమా చూసి..
ఎంజీఎం స్కూల్లో గ్యాంగ్ సినిమా చూపించి కిడ్నాపర్ల కు ఎలా కిడ్నాప్ చేయాలనే స్కెచ్ మొత్తం తాను(అఖిల ప్రియ), భార్గవ్ రామ్ వివరించామని, మొత్తం సినిమా తరహాలోనే ఈ కిడ్నాప్ మొత్తం ప్లాన్ చేశామని అఖిలప్రియ పోలీసుల విచారణలో చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే కిడ్నాప్ సమయంలో బోయిన్పల్లి వరకు భార్గవ్ రామ్ కిడ్నాపర్లతో పాటు కార్లోనే వెళ్లారు. కిడ్నాపర్లు ముగ్గురు వ్యక్తులను కిడ్నాప్ చేసిన తర్వాత భార్గవ్ రామ్ అక్కడి నుంచి మొయినాబాద్ ఫామ్ హౌస్కి ముందుగానే చేరుకున్నారు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం కిడ్నాపర్లు ఆ ముగ్గురు వ్యక్తులను మొయినాబాద్ ఫామ్ హౌస్కి తీసుకెళ్లారు.
పోలీసుల ఎంట్రీతో ప్లాన్ ప్లాప్
అక్కడ భార్గవ్ రామ్ సంజయ్, ప్రవీణ్ లతో ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకున్నాడని, కిడ్నాప్ ప్లాన్ కు సంబంధించిన వివరాలను అఖిలప్రియ పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కిడ్నాప్ తర్వాత పోలీసుల వేట మొదలు కావడంతో ప్లాన్ మార్చినట్లు అఖిల ప్రియ పోలీసు విచారణలో తెలిపింది. కిడ్నాప్ చేసిన వారిని వెంటనే అక్కడ వదిలేయాలని ఆదేశించానని చెప్పినట్లు సమాచారం. మూడు రోజుల కస్టడీలో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు.
సీన్లో అఖిల.. సూత్రధారులు ఎక్కడ?
అఖిల ప్రియ ఆదేశాలతో కిడ్నాపర్లు కిడ్నాప్ చేసిన ముగ్గురినీ అక్కడ వదిలేసి పారిపోయారని పోలీసులు తెలిపారు. అయితే ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించిన 15 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన చంద్రహాస్, భార్గవ్, మాదల శీను కోసం ప్రత్యేక పోలీసుల బృందంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ ముగ్గురు వ్యక్తులు దొరికితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. కాగా, టీడీపీలో కీలక నేతగా ఉన్న అఖిలప్రియ అరెస్టు తర్వాత పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం చర్చనీయాంశమైంది.
అలెర్ట్: sankranti: ఊరెళ్లిపోయారా? -ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టొద్దు: పోలీసుల హెచ్చరిక