నీ వెనుక మేం ఉన్నాం: ఆ విషయంలో జాగ్రత్త: అఖిల ప్రియకు చంద్రబాబు ఫోన్: ఫస్ట్టైమ్
అమరావతి: తెలుగుదేశం సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి భూమా అఖిలప్రియకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. ఆమెను పరామర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ ఉదంతంలో ఆమె ఏ1గా ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. రెండువారాలకుపైగా జైలులో విచారణను ఎదుర్కొన్న అఖిలప్రియ బెయిల్పై విడుదలయ్యారు. ఆమె విడుదలైన కొద్దిసేపటికే చంద్రబాబు ఫోన్ చేసి, పరామర్శించారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు అఖిలప్రియను పరామర్శించడం ఇదే తొలిసారి. భూమా అఖిలప్రియకు మద్దతుగా టీడీపీ నేతలు ఎవరూ ఇప్పటిదాకా స్పందించలేదు. జేసీ పవన్ కుమార్ రెడ్డి ఒక్కరే.. అఖిలప్రియకు మద్దతుగా మాట్లాడారు. బోయిన్పల్లి కిడ్నాప్ ఘటనపై స్పందించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆమెకు బెయిల్ మంజూరు కావడంతో చంద్రబాబే ఆమెను పరామర్శించారు. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
ఎన్ని కష్టాలు ఎదురైనా మనోనిబ్బరాన్ని వదులుకోవద్దని,.ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పార్టీ క్యాడర్ మొత్తం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఇప్పటిదాకా 20 మంది వరకు అరెస్ట్ అయ్యారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులుగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ సహా మరికొందరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియకు నాంపల్లి సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనితో చంచల్గూడ జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. 10 వేల రూపాయల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలను సమర్పించిన అనంతరం న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. కిడ్నాప్ కేసు వెనుక గల కారణాలను వవరించడానికి ఆమె మీడియా ముందుకొస్తారనే ప్రచారం సాగుతోంది.