జాగ్రత్తలు తీసుకోవాల్సింది: విద్యుత్ ప్లగ్లో వేలు పెట్టి చిన్నారి మృతి
పశ్చిమగోదావరి: చిన్న పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగానే చూసుకుంటారు. కానీ, ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాజాగా, జరిగిన విషాద ఘటన ఈ తల్లిదండ్రుల జీవితంలో తీరని విషాదాన్ని నింపింది.
విద్యుత్ ప్లగ్లో వేలుపెట్టి ఓ చిన్నారి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఏలూరుకు చెందిన అబ్బిండి సురేష్, స్వాతి దంపతులకు పూర్ణధర్మతేజ(18 నెలలు) కుమారుడు, నాలుగు నెలల కుమార్తె ఉన్నారు.
కాన్పు కోసం స్వాతి పుట్టిల్లు కృష్ణాజిల్లా బాపులపాడుకు వచ్చి ఇక్కడే ఉంది. గురువారం ఉదయం ఇంట్లో ఆడుకుంటున్న పూర్ణధర్మతేజను ఎవరూ గమనించని సమయంలో విద్యుత్ ప్లగ్లో వేలు పెట్టాడు.
విద్యుదాఘాతానికి గురికావడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. శుక్రవారం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్షలు చేశారు. రెండేళ్లు కూడా నిండని కుమారుడి మరణంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.