ప్రేమ పెళ్లి ప్రాణం తీసింది...కేసులకు భయపడి పోలీస్ స్టేషన్ లోనే యువకుడి ఆత్మహత్య...
గుంటూరు జిల్లా : ప్రేమపేరుతో చెలరేగిపోయే యువకులకు హెచ్చరిక లాంటిదీ ఉదంతం. వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. తీరా విషయం బైటపడి వ్యవహారం కేసులదాకా వెళ్లి గానే పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వగానే పెళ్లికూతురు తన తల్లిదండ్రులతో వెళ్లిపోయింది. దీంతో పోలీసు కేసులతో తాను, తన కుటుంబానికి ఇబ్బందులు తప్పవని భయపడిన యువకుడు పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా రేపల్లెలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టించింది.
రేపల్లె గుడ్డికాయలంకకు చెందిన యరగళ్ళ శ్రీని వాసరావు (21) పట్టణంలోని 16వ వార్డుకు చెందిన బాలికను ప్రేమించాడు. పెద్దలను ఎదిరించి వారం కిందట డిసెంబరు 30న పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి విషయం తెలిసి బాలిక తల్లిదండ్రులు తర్వాతి రోజు రేపల్లె పట్టణ పోలీసుస్టేషన్లో శ్రీనివాసరావు, అతని తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ పెంచలరెడ్డి ఇరువర్గాల పెద్దలను జనవరి 3వ తేదీన పిలిపించి బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.
పోలీసులకు భయపడి శ్రీనివాసరావు పోలీసు స్టేషనుకు రాలేదు. ఆ తరువాత సాయంత్రం 7 గంటల సమయంలో గ్రామపెద్దలను తీసుకుని పోలీసుస్టేషన్కు వచ్చాడు. సీఐ, ఎస్ఐలు పట్టణంలో వాహనాల తనిఖీలో ఉన్నారనీ, వారు వచ్చేసరికి 9 గంటలు అవుతుందనీ, మీరు సిఐ వచ్చేంతవరకు బయట కూర్చోండి అనీ సెంట్రీ వారికి చెప్పినట్లు తెలిసింది.
ధీంతో పోలీసులు తనను, తన తల్లిదండ్రులపై కేసు పెడతారని భావించి శ్రీనివాసరావు తీవ్రమైన భయాందోళనలకు లోనయ్యాడు. పైగా తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా తల్లిదండ్రులతో వెళ్లిపోవడంతో ఇక తనకు ఇబ్బందులు తప్పవని మానసికంగా కుంగిపోయాడు. బాత్రూమ్ వెళ్లొస్తానంటూ పోలీసులతో చెప్పి పోలీసుస్టేషన్ ఆవరణలోనే ఉన్న బాత్రూమ్కు వెళ్ళాడు. అయితే శ్రీనివాసరావు ఎంతసేపటికీ రాకపోవడంతో బంధువులు బయటకు వెళ్ళాడేమోనని ఆ పరిసర ప్రాంతాలు పరిశీలించారు.
ఎక్కడా కనపడకపోవటంతో పోలీసుస్టేషన్ ఆవరణలోని బాత్రూమ్లో పరిశీలించగా తాడుతో ఉరి వేసుకుని కొనఊపిరితో ఉన్నాడు. దీంతో బంధువులు, పోలీసుల సహాయంతో పట్టణంలోని ఎయిమ్స్కు తీసుకెళ్ళగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని పోలీసుస్టేషన్కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని తల్లిదండ్రుల కు అప్పగించారు. మృతుడికి తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు ఉన్నారు. రూరల్ ఎస్పీ అప్పలనాయుడు, తెనాలి ఆర్డీవో నరసింహు లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. సోదరుడు యరగళ్ళ గోపీకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ గంగాధర్ తెలిపారు.