ప్రియుడే మోసగాడు: ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి తెలివైన మోసం
విశాఖపట్నం: ప్రేయసి కళ్లు గప్పి ఆమె వద్ద నుంచే పలు దఫాలుగా డబ్బు గుంజిన ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి ఉదంతం ఇది. అరిలోవ పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ దాసరి రవిబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా కోటపాడు మండలం పొడుగుపాలేనికి చెందిన సందీప్నాయుడు రాజస్థాన్లోని బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్లో చేరాడు.
ఏడాది గడిచిన తర్వాత తన పాత స్నేహితులు కలవడంతో తల్లిదండ్రులకు చెప్పకుండా విశాఖకు తిరిగి వచ్చేశాడు. విశాఖలోనే ఉంటూ రాజస్థాన్లో ఉన్నానని తల్లిదండ్రులను నమ్మించి... తనకు ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చేరిన ఫోటోలను తల్లిదండ్రులకు పంపి డబ్బులు తీసుకునేవాడు.
మరికొన్ని సార్లు తాను ఢిల్లీ, చెన్నై, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాల్లో ఉన్నానంటూ చెప్పేవాడు. ఆరోగ్యం బాగాలేదని చెప్పినప్పటికీ, చదువుకుంటున్నట్లు నమ్మించడంతో విడతల వారీగా తల్లిదండ్రులు సుమారు రూ. 50 లక్షల వరకు పంపించారు. ఇలా పంపిన డబ్బును తన జల్సాలకు ఖర్చు పెట్టుకోసాగాడు.
ఈ క్రమంలో ఇతనికి పాత మిత్రుడు తూము వినయ్చౌదరి జత కలిశాడు. వినయ్ తాను చదువుతున్న ఇంజినీరింగ్ కళాశాలలో ఒక యువతిని సందీప్కు పరిచయం చేశాడు. పరిచయం పెరిగిన ఆమె మాటల మధ్యలో తన ఫొటోలను చిన్ననాటి మిత్రుడికి ఇచ్చానని చెప్పడంతో సందీప్ నాయుడు ఓ ప్లాన్ వేశాడు.
యువతి మిత్రుడి పేరుతో ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఈ క్రమంలో 'నీ ఫొటోలు నా వద్ద ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే సోషల్మీడియాలో పెడతా'నంటూ బెదిరించాడు. దీంతో భయపడిన ఆ యువతి కొంత డబ్బుని అతడు సూచించిన బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఇదే విషయాన్ని సందీప్ నాయుడితో ఆ యువతి చెప్పింది.
దీంతో ఆ డబ్బును తనకే ఇస్తే అతడి బ్యాంకు అకౌంట్లో వేస్తానంటూ ఆ యవతి నుంచి డబ్బు తీసుకునేవాడు. ఇలా సుమారు 80 వేల వరకు ఆ యువతి నుంచి సందీప్ నాయుడు తీసుకున్నాడు. ఇదేదో బాగుందే అంటూ తన బంధువుల్లోని ఒ మహిళ పేరుతో మరో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశాడు.
ఆ మహిళను యువతి మిత్రుడి తల్లిగా పరిచయం చేసి యువతితో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. యువతి వివాహం చేసుకోకపోతే తన కొడుకు బతకలేనని అంటున్నాడని, చచ్చిపోతాడని బెదిరింపు మేసేజ్లు పెట్టేవాడు. దీంతో ఇంక ఆలస్యం చేస్తే బాగుండదని అసలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.
వెంటనే యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే తల్లిదండ్రులు, యువతితోపాటు ఫిర్యాదు చేయడానికి సందీప్ కూడా వెళ్లాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటకొచ్చాయి.
యవతి ప్రేమికుడే బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో జరిగిన విషయాన్ని సందీప్ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు తమ కుమారుడు విశాఖలో ఉన్న విషయమే తెలియదని చెప్పారు. ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్నట్లు అనేకసార్లు ఫొటోలు పంపించేవాడని, ఓసారి సందీప్ చనిపోయినట్లు మిత్రులు ఫోన్ చేయడంతో ముంబైకి కూడా వెళ్లానని తండ్రి పేర్కొన్నారు.
చివరకు సందీప్ ప్లాన్ వెనుక విశాఖలోని సాగర్నగర్కు చెందిన తూము వినయ్చౌదరి ఉన్నాడని, అతడిని కూడా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. సందీప్ను అరెస్టు చేసి, అతడి నుంచి నాలుగు సిమ్లు, క్రెడిట్ కార్డులతో పాటు నాలుగు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడి కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.