బోటు వెలికితీతకు బ్రేక్.. గజఈతగాళ్లు దిగితే తప్ప ఫలితం రాని పరిస్థితి
తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ప్రమాదంలో చిక్కుకున్న బోటును బయటకు తీసేందుకు మరోసారి ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలకు మరోసారి బ్రేక్ పడింది. తన బృందం చేస్తున్న ప్రయత్నాలకు గత ఈతగాళ్ల సహయం ఉంటే తప్ప బోటు బయటకు రాని పరిస్థితి కనిపిస్తోంది. అయితే బోటులో శవాలు ఉన్నాయనే ప్రచారంతో పాటు మునిగిన ప్రాంతం కొంత ప్రమాదకరంగా ఉండడంతో గజ ఈతగాళ్లు బోటు దగ్గరకు వెళ్లేందుకు తన బృందంలోని సభ్యులు జంకుతున్నారు.
విశాఖకు వెళ్లిన ధర్మాడి సత్యం
దీంతో విశాఖపట్నం నుండి ప్రత్యేకంగా గజఈతగాళ్లను తీసుకువచ్చి వారితో నేరుగా బోటకు లంగరు వేసేందుకు సత్యం బృందం చర్చలు జరిపేందుకు నేటి ప్రయత్నాలకు బ్రేకులు వేశారు. వారితో చర్చించేందుకు ధర్మాడి సత్యం విశాఖకు వెళ్లారు. దీంతో విశాఖపట్నం నుండి వచ్చి గజఈతగాళ్లు ఆక్సిజన్ సిలిండర్లతో బోటు వద్దకు వెళితే తప్ప బోటు చిక్కే అవకాశం కనిపించడం లేదు. దీంతో విశాఖ ఈతగాళ్ల నిర్ణయంపై బోటు వెలికితీత ఆధారపడి ఉండే పరిస్థితి కనిపిస్తోంది.
50 అడుగుల లోతులో బోటు
సత్యం బృందం రెండవ దఫా బోటును వెలికి తీసేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో బోటు లంగరుకు చిక్కినట్టే చిక్కి తిరిగి నీళ్లలోకి జారీ పోతుంది. దీంతో మూడవరోజు చేసిన ప్రయత్నాల్లో బోటు రెయిలింగ్ ఊడి వచ్చిన పరిస్థితి కనిపించింది. మరోవైపు 50 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు సత్యం బృందం సభ్యులు చెబుతున్నారు. దీంతో పూర్తిస్థాయిలో లంగరు వేసి, తాళ్లతో బిగిస్తే తప్ప పూర్తిగా బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
నెలరోజులు గడుస్తున్న బయటకు రాని బోటు
సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాద సమయంలో 8 మంది సిబ్బందితో పాటు ముగ్గురు పిల్లలు సహా మొత్తం 75 మంది ఉన్నాట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. ఇప్పటి వరకు 38 మృతదేహాలను బయటకు తీశారు. కాగా మరో 11 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో సత్యం బృందం బోటును వెలికి తీస్తే కాని మృతదేహాల జాడపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. మొత్తం మీద మరో రెండు రోజుల్లో ఫలితం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.