జగన్ పార్టీ మహిళా ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు: లంచంగా ఎంతంటే..?
విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై అవినీతి ఆరోపణలు సంచలనంగా మారాయి. ఫిరంగిపురం మండలం బేతపూడి సొసైటీ అధ్యక్షుడు జాకీర్ ఈ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేశారు.
సిమెంట్ రోడ్డు బిల్లుల విషయంలో ఎమ్మెల్యే శ్రీదేవి రూ. 3 లక్షల లంచం తీసుకున్నారంటూ ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తన సొసైటీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేస్తున్నట్లు జాకీర్ తెలిపారు. కాగా, ఎమ్మెల్యే శ్రీదేవి తీరుపై త్వరలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని పలువురు బేతపూడి ముస్లిం పెద్దలు చెప్పారు.
కాగా, ఇటీవల తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఆడవారిపై వేధింపులకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని జగన్ సర్కారు హెచ్చరికలు చేస్తున్నా.. ఓ మహిళా ఎమ్మెల్యేపైనే కొందరు అభ్యంతరకర పోస్టులు పెడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.
Recommended Video
ఇది ఇలావుండగా, వైసీపీ మరో మహిళా ఎమ్మెల్యే విడదల రజినీపై గత కొద్ది రోజుల క్రితం ఇద్దరు యువకులు అభ్యంతరకర పోస్టులు పెట్టడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేను కించపరిచే విధంగా నెల్లూరు జిల్లాకు చెందిన యువకులు సత్యం రెడ్డి, ప్రవీణ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.