ఇద్దరు పిల్లలున్నా!.. పెళ్లికి ఓకె చెప్పింది, తీరా పెళ్లి టైమ్కి 'ట్విస్ట్'
పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయి, తీరా పెళ్లి దగ్గరికొచ్చేసరికి సదరు పెళ్లి కొడుకు చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు.
చిత్తూరు: రెండో పెళ్లి సంబంధం.. పైగా అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నోడు కదా! జీవితం బాగుంటుందన్న ఉద్దేశ్యంతో ఓ యువతి ఆ సంబంధానికి ఓకె చెప్పింది. కానీ పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయి, తీరా పెళ్లి దగ్గరికొచ్చేసరికి సదరు పెళ్లి కొడుకు చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు.
పెళ్లి కొడుకు చేసిన ఈ పనికి యువతి కుటుంబం నిర్ఘాంతపోగా.. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో అతగాడి రాకకోసం వారంతా నిరీక్షిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని బి.కొత్తకోటలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా పీటీఎం మండలం ఉప్పరవాండ్లపల్లెకు చెందిన యువకుడు గంగాధర్ మండల కేంద్రం సమీపంలోని తాకాటంవారిపల్లెలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అనారోగ్య కారణాలతో ఇటీవలే అతని భార్య మృతి చెందింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే వారి కుటుంబ సాంప్రదాయం మేరకు భార్య చనిపోయిన ఏడాదిలోగా మరో పెళ్లి చేసుకోవాలన్న ప్రయత్నాలు చేశారు.
ఈ క్రమంలో కడప జిల్లా రాయచోటీకి చెందిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని స్వరూపారాణితో అతనికి వివాహం ఖాయమైంది. ఈ నెల23వ తేదీన పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. బి.కొత్తపేటలోని ఓ శివాలయంలో ఈ పెళ్లి కోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. 22వ తేదీ రాత్రి వధువును తీసుకుని ఆమె కుటుంబ సభ్యులంతా బి.కొత్తకోట శివాలయం వద్దకు చేరుకున్నారు.
అయితే అప్పటికే గంగాధర్ తన ఇద్దరు పిల్లలతో సహా ఊరి నుంచి చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. దీంతో పీటల మీద పెళ్లి ఆగినంత పనైంది. గంగాధర్ కోసం ఇరు కుటుంబాలు ఎంతగా వెతికినా లాభం లేకపోయింది. ఫోన్ ద్వారా సంప్రదిస్తే.. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తేల్చేశాడు.
ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్చాఫ్. గంగాధర్ తీరుతో వధువు కుటుంబ సభ్యులంతా ఆవేదన చెందుతుండగా.. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడినుంచి కదిలేది లేదని స్థానికంగా ఉండే సత్రంలో బైఠాయించింది యువతి. ఆమె కుటుంబ సభ్యులు కూడా అదే సత్రంలో ఉంటున్నారు. గంగాధర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై మల్లిఖార్జున దర్యాప్తు ప్రారంభించారు.