పవన్కు క్షమాపణలు చెప్పకుంటే: జగన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తోన్న కాపునాడు
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలపై దుమారం చెలరేగుతోంది. జనసేనానిపై అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని టీడీపీ నేతలు కూడా తప్పుబట్టారు. అయితే వారిద్దరి వివాదంలో తలదూర్చవద్దని టీడీపీ అధిష్టానం నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
Recommended Video
పవన్ పెళ్లాల విషయం వాళ్లే తేల్చుకోవాలి...జగన్ కు ఆ హక్కు లేదు: ఉండవల్లి
పవన్పై జగన్ వ్యక్తిగత విమర్శలు చేశారు. నలుగురు పెళ్లాలని, అలా మనం చేస్తే నిత్య పెళ్లి కొడుకు అని అరెస్టు చేసేవారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై దుమారం రేగుతోంది. ఓ పార్టీ అధ్యక్షుడిగా పవన్పై రాజకీయంగా ఏమైనా మాట్లాడవచ్చునని, కానీ వ్యక్తిగత విమర్శలు సరికావని అంటున్నారు.
కాపునాడు తీవ్ర హెచ్చరిక
పవన్కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగారని ఏపీ రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు ఈశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. పవన్పై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాపు సమాజం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
అందువల్లే నిరాశలో ఇలాంటి వ్యాఖ్యలు
పవన్పై రాజకీయంగా ఏమైనా విమర్శలు చేయవచ్చునని, వ్యక్తిగత విమర్శలు మాత్రం సరికాదని ఏపీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పార్లమెంటులో పోరాడలేకపోవడం, మంగళవారం నాటి బంద్ విఫలం నేపథ్యంలో నిరాశకు లోనైన జగన్మోహన్రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు.
రాజకీయాలను కలుషితం చేయడానికి దారితీస్తుంది
రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని, వ్యక్తిగతమైన కుటుంబ అంశాలను ఇందులోకి లాగి కించపరచడం సరికాదని మంత్రి పుల్లారావు అన్నారు. పవన్కు నలుగురు భార్యలు అంటూ మాట్లాడటం నూటికి నూరుపాళ్లు తప్పని ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అన్నారు. పవన్ వివాహాల గురించి మాట్లాడాల్సింది అతనిని పెళ్లి చేసుకున్న వారే అన్నారు. ఐపీసీ 20వ చాప్టర్ ప్రకారం బాధితులకే అలా మాట్లాడే హక్కు ఉందన్నారు. ఎవరి ఇష్ట ప్రకారం వారు పెళ్లిళ్లు చేసుకుంటారని, ఏదైనా మాట్లాడదల్చుకుంటే లీగల్ పద్ధతులు అనుసరించాలన్నారు. ఇలా వ్యక్తిగత ఆరోపణలు చేయడం తాను ఇదివరకు వినలేదన్నారు. ఇది రాజకీయాలను కలుషితం చేయడానికే దారి తీస్తుందన్నారు.
పశ్చిమ గోదావరిలో టీడీపీకి అన్ని స్థానాలు ఎలా వచ్చాయి?
కాగా, వేలకోట్లు దోచి జైల్లో కూర్చొని వచ్చిన వాళ్లు కూడా నీతులు చెబుతున్నారని పవన్.. జగన్కు కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాను 25 ఏళ్లు కష్టపడి ఒక స్థాయికి వచ్చి రూ.25 కోట్ల పన్ను కడితే జగన్ మాత్రం రెండు మూడేళ్లలో రూ.300 కోట్ల పన్ను ఎలా కట్టగలిగారో అర్థం కాలేదన్నారు. పైరవీకారులు, దోపిడీదారులు అధికారంలో కూర్చొంటే సామాన్యుడికి న్యాయం జరగదని, బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మూడో ప్రత్యామ్నాయం అవసరమని, అందుకే జనసేన పార్టీ పెట్టానని చెప్పారు. వైసీపీలాంటి ఫ్యాక్షన్ పార్టీలను ఎదుర్కోడానికి కత్తులు, బాంబులు లేకపోవచ్చని కానీ ఆ పార్టీ గూండాలను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం జనసైనికులకు ఉందన్నారు. నేను వ్యక్తిగతంగా మాట్లాడడం మొదలు పెడితే ఫ్యాక్షనిస్టు నాయకులు ఊహించలేరని, తట్టుకోలేరన్నారు. వారు పారిపోతారన్నారు. ఇసుక మాఫియా, కుంభకోణాలు, దోపిడీలు చేసే వీళ్లకే పిచ్చిపిచ్చిగా మాట్లాడే తెగింపు ఉంటే ప్రజాసంక్షేమం కోసం నిలబడే నాకు ఎంత తెగింపు ఉండాలన్నారు. చూడ్డానికే పవన్ మెత్తగా కనిపిస్తాడని, తేడా వస్తే తోలు తీస్తాడని, సమాజంలో మార్పు తీసుకొస్తాననే భయంతోనే టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతలు తనను తిడుతున్నారన్నారు. తాను కులాన్ని నమ్ముకున్న నాయకుడిని అని చంద్రబాబు అనడం బాధ కల్గించిందని పవన్ అన్నారు. నిజంగా తాను కులాన్నే నమ్ముకుంటే 2014లో టీడీపీకి ఎందుకు మద్దతు పలికేవాడినని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరివల్ల టీడీపీకి 15 అసెంబ్లీ స్థానాలు వచ్చాయో తెలిసి కూడా ఆయన ఆ మాటలు అనడం బాధ వేసిందన్నారు. ఆ జిల్లాను టీడీపీ నిర్లక్ష్యం చేసిందన్నారు. రాష్ట్ర ఖజానాకు ధర్మకర్తగా ఉండాల్సిన సీఎం విలాసాల కోసం కోట్ల రూపాయలు తగలేస్తున్నారన్నారు.