ఇంగ్లీష్ స్కిల్స్ కోసం ఏపీ సర్కార్ నిర్ణయం ... విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు ,ఇంగ్లీష్ ఎడ్యుకేషనల్
వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన చెయ్యాలని నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం అందుకు ఇప్పటి నుండే విద్యార్థులను సిద్ధం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది.బ్రిడ్జి కోర్సు తో పాటు , ఇంగ్లీష్ ఎడ్యుకేషనల్ సినిమాలు చూపించి ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం ఇప్పటి నుండే విద్యార్థుల్లో పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. అందుకు ఈ నెల నుండే ప్రణాళిక సిద్ధం చేసింది.
దేశంలో జగన్ క్రేజ్ ను పెంచుతున్న ఆ చట్టం: ఏపీలో బాటలో మహారాష్ట్ర
ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనకు కసరత్తులు
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పు కోసం కీలక నిర్ణయం తీసుకోవటం దానిపై విమర్శలు రావటం తెలిసిందే.
రానున్న విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ తెలుగు మీడియం చదువులకు స్వస్తి పలికి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయాలని నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలలలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని అందుకోసం కసరత్తులు చేస్తున్నారు.
లాంగ్వేజ్ స్కిల్స్ పెంచేలా సీఎం జగన్ పలు నిర్ణయాలు
పాఠ్య పుస్తకాల ముద్రణ, టీచర్స్ కి ట్రైనింగ్ మాత్రమే కాకుండా విద్యార్థుల్లో లాంగ్వేజ్ స్కిల్స్ పెంచేలా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవలే రానున్న విద్యా సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నిర్వహించనున్నట్టు ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలులోకి రానున్నట్లు చెప్పిన ప్రభుత్వం అందుకు కావలసిన అన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
ఇంగ్లీష్ లో బుక్స్ సిద్ధం చేస్తున్న విద్యా శాఖ .. బేసిక్స్ నేర్పించాలని నిర్ణయం
దీంతో వచ్చే విద్యా సంవత్సరానికి ఇంగ్లీషు మీడియంలో పుస్తకాలను ముద్రించి అందుబాటులోకి తీసుకు వస్తున్న సర్కార్ ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంలోకి మారితే అర్ధం చేసుకోవటం కష్టం అవుతుందని ముందే వారికి బేసిక్స్ నేర్పించాలని నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు రీ ఓపెన్ చేసే సరికి విద్యార్థుల్లో ఏ టెన్షన్ లేకుండా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం బ్రిడ్జి కోర్సు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. ఇక దీని కోసం విద్యార్థులకు ముందుగానే ఇంగ్లీషు మీడియం క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నారు.
నెలరోజుల పాటు బ్రిడ్జి కోర్సు, ఇంగ్లీష్ ఎడ్యుకేషనల్ మూవీస్
అందుకే ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 22 వరకూ ప్రాథమిక బ్రిడ్జి కోర్సు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా విద్యార్థులకు ఇల్లు, వ్యక్తిత్వం, మొక్కలు, పండుగలు, జంతువులు, పండ్లు, కూరగాయలు, పూలు, రవాణా, ప్రకృతి తదితర అంశాలకు సంబంధించి బోధనలు ఇంగ్లీష్ లో చేయనున్నారు. అలాగే ఇంగ్లీషుపై విద్యార్థులు పట్టు సాధించేందుకు రోజూ ఎడ్యుకేషనల్ ఇంగ్లీష్ సినిమాలను ప్రదర్శిస్తారు. దీంతో విద్యార్థులకు అర్థమయ్యే ఛాన్స్ ఉందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.