కృష్ణా జలాలపై ట్రిబ్యునల్: రాష్ట్రానికి ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును పెంచడాన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సమర్థించింది. కృష్ణా జలాల పంపకంపై ట్రిబ్యునల్ శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1001 నుంచి 1005 టిఎంసిల నీటిని కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డిఎస్)కు 4 టిఎంసిల నీటిని కేటాయించింది. ఇది తప్ప ఆంధ్రప్రదేశ్కు కృష్ణా నది జలాల పంపకంలో ఏ విధమైన ఊరట లభించలేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పట్టించుకోలేదు. కృష్ణా నది నీటి వాడకాన్ని 65 శాతం నుంచి 75 శాతానికి పెంచాలనే ఆంధ్రప్రదేశ్ వాదనను తోసిపుచ్చుతూ 65 శాతానికి పరిమితం చేయాలనే కర్ణాటక వాదనను ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కును కోల్పోయింది. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 524 అడుగులకు పెంచడానికి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది.
మధ్యంత ఉత్తర్వుల్లో పెద్ద తేడా లేకుండా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పును వెలువరించింది. జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని దిలీప్ కుమార్, డిపి దాస్లతో కూడిన ట్రిబ్యునల్ ఆ తీర్పును వెలువరించింది. గెజిట్లో నమోదైనప్పటి నుంమచి 2050 మే 31వ తేదీ వరకు ఈ తీర్పు అమలులో ఉంటుంది. ఆల్మట్టి ఎత్తు పెంచుకోవడానికి ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వడం పట్ల కర్ణాటక రాష్ట్రం హర్షం వ్యక్తం చేస్తోంది.
2011లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. తాను తుది తీర్పు ఇచ్చే వరకూ ట్రిబ్యునల్ అవార్డును గెజిట్లో ప్రచురించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కృష్ణానది జల వివాదాల పరిష్కారం కోసం 2004లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ వాస్తవానికి 2010 డిసెంబర్ 30నే తీర్పు ప్రకటించింది.
అయితే, దీనిపై ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలు కూడా పలు అభ్యంతరాలను లేవనెత్తాయి. దీంతో 2011 నుంచి ఈ అభ్యంతరాలపై ట్రిబ్యునల్ విచారణ జరిపింది. 1973లో బచావత్ అవార్డు ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, మహారాష్ట్రకు 585 టీఎంసీలు కేటాయించగా.. మూడేళ్ల కిందట వెలువడ్డ బ్రిజేష్కుమార్ అవార్డులో 65 శాతం ఆధారపడదగ్గ జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్కు 1001 టీఎంసీలు, కర్ణాటకకు 911 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి.
అయితే కృష్ణా నదిలో నికర జలాలను మాత్రమే పంచిపెట్టిన బచావత్ అవార్డు.. మిగులు జలాలపై హక్కును దిగువ పరివాహక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ఇచ్చింది. కానీ, బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ మాత్రం మిగులు జలాలను 285 టీఎంసీలుగా లెక్కగట్టి, వాటిని కూడా మూడు రాష్ట్రాలకు పంచింది.