వైఎస్ లేఖ: బాబుకు జగన్ దొరికిపోయారా, ఏంచెప్పారు?
హైదరాబాద్: బ్రిజేష్ ట్రిబ్యునల్కు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన లేఖ విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిది సెల్ఫ్ గోల్ చేసుకున్నారా? అనే చర్చ సాగుతోంది. కృష్ణా జలాల విషయంలో తన తండ్రి వైయస్ తప్పు చేస్తే, మీరు ఎందుకు సరిచేయలేదని వైయస్ జగన్ అన్నారని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. తద్వారా జగన్ తండ్రి తప్పును అంగీకరించారని టిడిపి అంటోంది.
కృష్ణా జలాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్కు తన తండ్రి ఇచ్చిన లేఖ తప్పయితే మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్యలు మార్చవచ్చు కదా!, ఎవరైనా కత్తిపెట్టి సరిదిద్ద వద్దని చెప్పారా? అని జగన్ ప్రశ్నించారు. అదే సమయంలో వైయస్ ఉద్దేశ్యం ప్రజలకు తెలుసునన్నారు.
అయితే వైయస్ తప్పు చేస్తే ఆ లేఖను మార్చవచ్చు కదా అని జగన్ ప్రశ్నించడం టిడిపికి ఆయుధంగా ఉపయోగపడింది. ఆ వ్యాఖ్యల ద్వారా వైయస్ లేఖ కారణంగా రాష్ట్రానికి నష్టం జరిగిందని జగన్ పరోక్షంగా అంగీకరించినట్లేనంటున్నారు. అదే మాటను చంద్రబాబు కృష్ణా జిల్లాలో చేపట్టిన మహాధర్నాలో చెప్పారు.
వైయస్ లేఖ వల్లనే కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి నష్టం జరిగిందని టిడిపి ఆరోపిస్తోంది. ఇప్పుడు జగన్ తన వ్యాఖ్యల ద్వారా చంద్రబాబుకు దొరికిపోయారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మిగులు జలాలు వద్దని వైయస్ ఇచ్చిన లేఖ వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రజలకు తెలుసునని, ఓట్ల కోసం జగన్ నీచ రాజకీయాలు మానాలని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు.
జగన్ ఏమన్నారు?
2004లో కొత్త ట్రిబ్యునల్ వచ్చిందని, ఎపికి నష్టం జరగకుండా ఉండటం కోసమని చెప్పి కొత్త ట్రిబ్యునల్ తీర్పు వచ్చే ముందే, ఎన్ని ప్రాజెక్టులు కట్టగలిగితే అన్ని కట్టి వీలైన మేరకు నికర జలాలను కేటాయింప చేసుకోవడం కోసం వైయస్ తీవ్రంగా ప్రయత్నించారని, వైయస్ ప్రాజెక్టులు కడుతున్నారని తెలిసి కర్నాటక కొత్త ట్రిబ్యునల్ను కలిసి ఆ ప్రాజెక్టులను నిలుపుదల చేస్తూ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరిందని, అలాంటి పరిస్థితుల మధ్య వైయస్ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా నోట్ ఇచ్చారని, అందులో ఎలాంటి రహస్యం లేదని, లేఖలోను తప్పు లేదని, అవన్నీ నికర జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులంటూ తన మనసులో ఉన్న మాట, ఏదైతే చేయాలనుకున్నారో అదే వైయస్ చెప్పారని జగన్ మంగళవారం చెప్పారు. వైయస్ లేఖ రాష్ట్ర ప్రయోజనాలకోసమేనని ప్రజలకందరికీ తెలుసునన్నారు.