తెలుగు రాష్ట్రాల మధ్యే కృష్ణా జలాల పంపిణీ: ట్రైబ్యునల్ కీలక తీర్పు
హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీ విషయంలో తెలుగు రాష్ట్రాలకు అనుకూలమైన తీర్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్యే కృష్ణా నది జలాల పంపిణీ జరగాలని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ బుధవారం కీలక తీర్పును వెలువరించింది.
ఏపీ, తెలంగాణల మధ్యే నీటిని పున: పంపిణీ చేయాలని తీర్పులో పేర్కొంది. ఈ జలాలతో మిగితా రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు మిగిలిన రాష్ట్రాలకు నాలుగు వారాల గడువు విధించింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.
కాగా, ఏడాది కాలంగా నాలుగు రాష్ట్రాలు తమ వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఇచ్చిన ట్రైబ్యునల్ తీర్పుతో తెలుగు రాష్ట్రాలు ఆనందం వ్యక్తం చేశాయి.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 1005 టీఎంసీల నీటిని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, మహారాష్ట్రకు 907, కర్ణాటకకు 607 టీఎంసీల జలాలను కేటాయించడం జరిగింది.
తెలంగాణకు అన్యాయమే
కాగా, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు అన్నారు. తీర్పుపై అప్పీల్కు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. జలాల పంపిణీ నాలుగు రాష్ట్రాల మధ్య సమస్య అని ట్రైబ్యునల్ పరిగణించలేదని అన్నారు.
ఏపీ, తెలంగాణల మధ్యే నీటి పంపిణీ సమస్యగా పరిగణించారని అన్నారు. హేతుబద్ధంగా జలాల పంపిణీ జరగాలంటే నాలుగు రాష్ట్రాలకు కేటాయింపులు జరపాలని తెలంగాణ వాదించినట్లు తెలిపారు.
సెక్షన్ 89 నాలుగు రాష్ట్రాలకు సంబంధించినది కాదని ట్రైబ్యునల్ అభిప్రాయపడిందని ఏఏజీ అన్నారు. వాదనను సరిగా తీసుకోలేదని అన్నారు. దీనిపై సుప్రీం నిర్ణయమే తుది తీర్పు అవుతుందని ఏఏజీ తెలిపారు.