మనీలాలో చిక్కుకున్న వారిని తీసుకురండి .. కేంద్ర విదేశాంగమంత్రికి చంద్రబాబు లేఖ
చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు ఇండియాను టెన్షన్ పెడుతుంది. రోజు రోజుకు కరోనా వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య పెరుగుతుంది . ఇప్పటివరకు ఇండియాలో 172 కేసులు నమోదు అయ్యాయని అధికారికంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం . ఇక ఇదే సమయంలో విదేశాల నుండి వచ్చే ప్రవాస భారతీయుల రాకపై కూడా నిషేధం విధించిన సంగతి తెలిసిందే . ఇక అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్య శాఖా మంత్రులతో ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు .
కరోనా ఎఫెక్ట్: ఒకేసారి ఆరు నెలల రేషన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం
ఇక ఇదే సమయంలో విదేశాల నుండి స్వదేశానికి రాలేక మధ్యలో చిక్కుకున్న విద్యార్థుల విషయంలో చొరవ చూపాలని వారిని తెలుగు రాష్ట్రాలకు తీసుకు వచ్చేలా చర్యలు చేపట్టాలని కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఫిలిప్పీన్స్లోని మనీలా ఎయిర్పోర్టులో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తిరిగి రావటానికి ఎలాంటి అవకాశం లేక అక్కడ చిక్కుకుపోయినట్టు ఆయన పేర్కొన్నారు.
146 మంది భారతీయులు అక్కడ ఎయిర్ పోర్ట్ లో ఉన్నారని , వారిలో చాలామంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉండటంతో ఆ విద్యార్థులను వెనక్కి రప్పించాలని ఆ లేఖలో కోరారు. 41 మంది ఆంధ్రప్రదేశ్కు చెందినవారు, 40 మంది తెలంగాణ వాసులు ఉన్నారని, ఇక తమ పిల్లల క్షేమ సమాచారం కోసం వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఢిల్లీతో పాటు హైదరాబాద్కు ప్రత్యేక విమానం ద్వారా విద్యార్థుల్ని తీసుకురావాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు.మరి ఇప్పటికే విదేశాల నుండి ఒక్కరు కూడా రావటానికి వీలు లేదని చాలా కఠిన నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కార్ ఈ విద్యార్థులు విషయంలో చంద్రబాబు చేసిన విజ్ఞప్తికి స్పందిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి .