రద్దీ మార్గంలో విరిగిన పట్టా: అదే రూట్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్: క్షణాల్లో.. !
కడప: మన రాష్ట్రం మీదుగా చెన్నై-ముంబై మధ్య రాకపోకలు సాగించడానికి అందుబాటులో ఉన్న ఏకైక రైలు మార్గం అది. రోజూ పదుల సంఖ్యలో ఎక్స్ప్రెస్, ప్యాసింజర్స్, గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. కడప మీదుగా తిరుపతికి వెళ్లడానికి ఉన్న మార్గం కూడా అదొక్కటే. అలాంటి మార్గంలో రైలు పట్టా విరిగిన ఘటన కలకలం రేపింది. రైల్వే స్టేషన్లో పనిచేసే ట్రాక్మెన్లు సకాలంలో గుర్తించడంతో వెంకటాద్రి ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది.
కడప జిల్లాలోని ఓబులవారి పల్లె రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి, రేణిగుంట మీదుగా చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రావడానికి సుమారు 20 నిమిషాల ముందు ఈ విషయాన్ని గుర్తించారు ట్రాక్మెన్లు. దీనితో రైలును ఓబులవారి పల్లెలో నిలిపివేశారు. రైలు ఓబులవారిపల్లె వద్దకు రాగానే పట్టా విరిగినట్టు గుర్తించారు. స్టేషన్ మాస్టర్కు సమాచారం ఇచ్చారు.
వెంటనే ఆయన ఈ విషయాన్ని రేణిగుంట జంక్షన్ అధికారులకు తెలియజేశారు. రేణిగుంట నుంచి ట్రాక్ ఇంజినీరింగ్ సిబ్బంది వచ్చి మరమ్మతులు చేపట్టారు. మరమ్మతుల కారణంగా రైలు దాదాపు గంటపాటు నిలిచిపోయింది. అదే మార్గంలో రాకపోకలు సాగించాల్సిన కొన్ని గూడ్స్ రైళ్లను కూడా ఓబులవారి పల్లెలోనే నిలిపివేశారు. విరిగిన పట్టాను సకాలంలో గుర్తించకపోయి ఉంటే పెను ప్రమాదానికి కారణమై ఉండొచ్చనే భయాందోళనలు స్థానికుల్లో వ్యక్తం అయ్యాయి.