మొబైల్ కోసం అక్కా తమ్ముడు గొడవ, మందలించిన తండ్రి, ఉరేసుకొన్న కుమారుడు..
మొబైల్.. మొబైల్... మొబైల్... ఫోన్ లేనిది పిల్లలు ఉండటం లేదు. కరోనా వైరస్ వల్ల స్కూళ్లు మూసేయడంతో... ఇంట్లో ఉంటున్న వారికి ఆటవిడుపే ఫోన్ ద్వారానే.. అయితే ఇంట్లో ఒకరిద్దరూ పిల్లలు ఉండి.. ఓకే ఫోన్ ఉంటే గొడవే.. గొడవపడితే ఫరావలేదు.. కానీ చిత్తూరు జిల్లా దోర్ణకంబాలలో ఓ బాలుడు ఫోన్ కోసం జరిగిన గొడవలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని.. కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు. తమ ముందే ఆడుకునే చిన్నారి బలవన్మరణానికి పాల్పడటంతో ఆ పేరంట్స్ బోరున విలపిస్తున్నారు.
మొబైల్ కోసం..
చంద్రగిరి మండలం ధోర్ణ కంబాలకు చెందిన సుమతి, రాజు దంపతులు. వీరికి ముని విద్య, ముని తేజ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఉన్న ఒక మొబైల్ కోసం అక్కా, తమ్ముడు గొడవపడ్డారు. ఎప్పటిలాగానే.. నిన్న కూడా కొట్లాడారు. విషయం తండ్రి రాజుకు తెలిసింది. కూతురుని బాధపెట్టడం ఇష్టం లేని ఆయన.. కుమారుడిని మందలించాడు. అక్కకు ఫోన్ ఇస్తే ఏమవుతుందని చెప్పి.. బెదిరించాడు.
తండ్రి మందలించడంతో..
అలా తండ్రి బెదిరించాడో లేదో.. బాలుడు ముని తేజ మనస్తాపానికి గురయ్యాడు. తన గదిలోకి వెళ్లి పోయి.. తలుపు వేసుకున్నాడు. సాధారణంగా వెళ్లాడని అనుకున్నారు.. కానీ గది నుంచి బయటకు రాలేదు. దీంతో తలుపు కొట్టిన తీయలేదు. గడ్డపారతో తలుపు తొలగించగా.. ఉరేసుకొని కనిపించాడు. వెంటనే అతనిని కిందకి తీసి.. 108కి ఫోన్ చేసి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే చనిపోయారని వైద్యులు తెలిపారు.
విషాద వదనం
తమ కుమారుడు చనిపోయాడని తెలిసి పేరంట్స్, బంధువులు బోరున విలపించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మొబైల్ ఫోన్ ఇవ్వడం లేదని బాలుడు ఘాతుకానికి బలవన్మరణానికి పాల్పడటం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది. సెలవుల్లో పిల్లలతో పేరంట్స్, బంధువులు గడపాలని.. వారిని మొబైల్కు అడిక్ట్ అయ్యేలా చూడొద్దని సైకలాజిస్టులు సూచిస్తున్నారు. వారితో గడిపి ఆడుకుంటే.. మొబైల్స్, గేమ్స్ అంటూ ఫోన్స్, ట్యాబ్లెట్లు పట్టుకోరు అని చెబుతున్నారు.