హృదయవిదారకం: చెల్లెలి మృతితో అన్నయ్య ఆత్మహత్య, చనిపోతానని తల్లి
ఏలూరు/విశాఖ: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. చెల్లెలు మృతితో కలత చెందిన అన్నయ్య కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. చెల్లెలు మృతిని తట్టుకోలేని ఆ అన్నయ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది స్థానికంగా అందర్నీ కంటతడి పెట్టించింది.
ఈ విషాదం హోలీ పండుగ నాడు చోటు చేసుకుంది. ఏలూరులోని చోడిదిబ్బకు చెందిన పార్వతి పూల వ్యాపారం చేస్తుంటారు. భర్తతో విభేదాలు రావటంతో తన ఇద్దరు పిల్లలు యామిని (17), వరప్రశాంత్(21)లతో కలిసి ఉంటున్నారు. యామిని ఏలూరులోని ఓ ప్రయివేటు కళశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసింది.
వరప్రశాంత్ స్థానిక కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తల్లి మందలించడంతో యామిని ఈ నెల 21వ తేదీన రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వరప్రశాంత్ కలత చెందాడు. చెల్లెలు మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.
బుధవారం యామిని చిన్న కర్మ చేస్తున్నారు. ఈ సమయంలో వరప్రశాంత్ మార్కెట్ యార్డుకు వెళ్లాడు. అక్కడ రైలు కింద పడి మృతి చెందాడు. దీంతో, కుమార్తె మృతితో రోదిస్తున్న పార్వతికి కుమారుడూ లేడన్న చేదు నిజాన్ని బంధువులు ఆలస్యంగా కాని చెప్పలేకపోయారు.
ఆ తల్లి పదేపదే కొడుకు కనిపించడం లేదేమని బంధువులను, అక్కడున్న వారిని అడిగింది. దీంతో కాసేపటికి కుమారుడు మృతి చెందిన విషయం చెప్పారు. విషయం తెలియడంతో.. తానూ చనిపోతానంటూ ఇంటి నుంచి పరుగులు తీసింది. బంధువులు, స్థానికులు ఆమెను పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆమె స్పృహ కోల్పోయారు.
విశాఖలో రేవ్ పార్టీ
విశాఖలోని సాగర్ నగర్లోని ఓ రెస్టారెంటులో రేవ్ పార్టీ జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాకా పీచ్లో మద్యం సేవిస్తూ చిందేశారు. పదుల సంఖ్యలో జంటలు, పలువురు రాజకీయ నేతల కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత వారిని విడిచి పెట్డినట్లుగా తెలుస్తోంది.