పులివెందులలో అడుగుపెట్టను: జగన్ ఫ్యామిలీపై బిటెక్ రవి నిప్పులు
దాదాపు నాలుగు దశాబ్దాలుగా వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం పులివెందుల ప్రజలకు చేసింది ఏమీ లేదని టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి మండిపడ్డారు.
పులివెందుల: దాదాపు నాలుగు దశాబ్దాలుగా వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం పులివెందుల ప్రజలకు చేసింది ఏమీ లేదని టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి మండిపడ్డారు. నగరంలో బుధవారం నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలో ఆయన పాల్గొని, ప్రసంగించారు.
జగన్ ఆఫీస్లోకి నీరుపై ట్విస్ట్: కుట్ర కోణం..
పులివెందుల నుంచి అనేక పదవులు అనుభవించి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనా ఈ ప్రాంతానికి చేసిందేమిటన్నారు. వైయస్ కుటుంబ సభ్యులు సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎన్నో పదవులు, బాధ్యతలు చేపట్టినా ఈ ప్రాంతానికి మీరు చేసిందేమిటన్నారు.
వైయస్ బంధువుల కోసం ప్రజలకు ఇబ్బంది
యర్రబల్లె చెరువుకు నీరు తెప్పించాల్సి ఉండగా వారి వారి బంధువుల మైనింగ్ ఉన్నందున నీరు తెప్పించలేదని బిటెక్ రవి తీవ్ర ఆరోపణలు చేశారు. చెరువుకు నీరు వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉంటారన్నారు.
ఈ మూడు హామీలు
పులివెందుల ప్రజలకు మూడు హామీలు ఇస్తున్నామని బిటెక్ రవి చెప్పారు. ఆర్వో నీళ్లు బిందె నీరు రూ. 2లకే ఇచ్చేలా, రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఈద్గాకు స్థలం కేటాయింపుపై కలెక్టర్తో చర్చిస్తామన్నారు. పక్కా ఇళ్ల నిర్మాణానికి స్థల సేకరణపై దృష్టి సారిస్తున్నామన్నారు.
పులివెందులలో అడుగు పెట్టను
ఈ హామీలు నెరవేర్చలేకపోతే తాను పులివెందులకు రానని బిటెక్ రవి సవాల్ చేశారు. ఈ సందర్భంగా ఆర్వో ప్లాంటు నిర్వాహకులకు నోటీసులు ఇవ్వాలని ఆయన మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డిని కోరారు.
పథకాలు ఉపయోగించుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని జాయింట్ కలెక్టర్ శ్వేత అన్నారు. ఈ పథకాలను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. అధికారులు ప్రభుత్వం ప్రకటించిన పథకాలను ప్రజలకు వివరించి లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు.